కారుపై పడిన సిమెంట్ ట్యాంకర్..ఒకరి మృతి

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారుపై సిమెంట్ ట్యాంకర్ పడిపోయింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు.

అమరావతి : ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు విఫలమవ్వడంతో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న సిమెంట్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి కారుపై బోల్తా పడింది. ప్రమాదంలో కారు(BMW) నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న వ్యక్తి బొద్దులూరి శ్రీనివాసరావు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. క్రేన్లు, జేసీబీ సాయంతో కారు మీద పడిన ట్యాంకర్‌ను తొలగించారు.

ప్రమాదానికి గురైన కారు టీఎస్‌ 09 ఎఫ్‌టీ 6662 న్యాయవాది శ్రీనివాసరావు పేరిట రిజిస్టరై ఉంది. కారు యజమాని ఎల్లారెడ్డిగూడ మారుతీ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నట్లు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి కారు హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైందని తెలిపారు.

Latest News