ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ పోస్టులను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ పోస్టులను కేంద్రం 174కు పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్లను కేటాయించాలని రాష్ట్రం కోరింది.
విధాత, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ పోస్టులను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ పోస్టులను కేంద్రం 174కు పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్లను కేటాయించాలని రాష్ట్రం కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఐపీఎస్లనలు పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్గా 38 మంది ఐపీఎస్లను కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్గా 23 మందిని కేటాయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 144 మంది ఐపీఎస్లను కేటాయించారు. కానీ అది రాష్ట్రానికి సరిపోలేదు. పైగా మాజీ సీఎం జగన్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. దీంతోపాటు నిఘా వ్యవస్థ విభాగాల్లో, క్రైమ్ విభాగాల్లో పోలీసు అధికారుల కొరత తీవ్రంగా మారింది.
దీంతో తమకు మరింత మంది ఐపీఎస్లను కేటాయించాలని జగన్ అప్పట్లో కేంద్రానికి లేఖ కూడా రాశారు. కానీ ఫలితం లేకపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రంలో ఐపీఎస్ల కొరత గురించి కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగైదు సంవత్సరాల అనుభవం ఉన్న జూనియర్ ఐపీఎస్లనే ఎస్పీలుగా నియమించాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల జిల్లాల్లో శాంతి భద్రతల సమస్యలతో పాటు పలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. చంద్రబాబు వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ప్రభుత్వం.. తాజాగా ఐపీఎస్ల సంఖ్యను పెంచింది.