Chandrababu Naidu : భారీ వర్షాలతో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

భారీ వర్షాలతో ఉత్తరాంధ్రలో మృతిచెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితులను సమీక్షించారు.

Chandrababu Naidu : భారీ వర్షాలతో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజ్ క్యాచ్ మెంట్లో 33 టీఎంసీలు, తోటపల్లి పరిధిలో 11 టీఎంసీలు మేర వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు వివరించారు.
గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ సీఎంకు చెప్పారు. ఒడిశాలో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని సీఎం దృష్టికి తెచ్చారు. భారీ వర్షాలతో విశాఖ నగరం కంచరపాలెం లో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని….ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు అధికారులు వివరించారు. శుక్రవారం సాయంత్రంలోపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ ను పునరుద్దరించాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ పునరుద్దరణలో ఎలాంటి జాప్యం చేయవద్దని ఆయన సూచించారు.