Site icon vidhaatha

నేటి నుంచి పోలీసులకు వీక్లి ఆఫ్ అమలు :సీఎం జగన్

విధాత‌: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్డేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 206 మంది అమరులైన పోలీసుల వివరాలతో కూడిన అమరులు వారు అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు.తదుపరి పోలీస్ అమరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అమరులైన పోలీసుల కుటుంబాల సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారన్నారు. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిగా వారికి వీక్లీఆఫ్‌ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపారు. కోవిడ్‌ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయమన్నారు.. ఇప్పుడు వైరస్‌ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు.

అమరవీరుల దినం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్,ఎపిఏస్ పి బెటాలియన్ ఐజిపి డా.శాఖబ్రత్ భాగ్చి,సిఐడి అడిషనల్ డిజిపి పి వి సునిల్ కుమార్,రాష్ట్ర మంత్రులు కొడాలి శ్రీవేంకటేశ్వరరావు(నాని),వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ జె. నివాస్,నగర సిపి బత్తిన శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

Exit mobile version