Cyclone Montha Landfall | అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన మొంథా తుఫాను : కాకినాడలో ఉగ్రరూపం

కాకినాడ–మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద మొంథా తుపాను తీరాన్ని తాకింది. గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీయడంతో పాటు తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. అధికారులు అత్యంత అప్రమత్తతతో ఉన్నారు.

Cyclone Montha Landfall | అంతర్వేది వద్ద తీరాన్ని తాకిన మొంథా తుఫాను : కాకినాడలో ఉగ్రరూపం

Cyclone Montha Makes Landfall Near Antarvedi Palem; Strong Winds and Heavy Rains Lash Andhra Coast

విధాత, (ఆంధ్రప్రదేశ్​ బ్యూరో) అమరావతి:

Cyclone Montha Landfall | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా మంగళవారం రాత్రి కాకినాడ–మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. వాతావరణశాఖ (IMD) ప్రకారం, గడచిన ఆరుగంటల్లో తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు కదిలి రాత్రి 9 గంటల నుండి తీరాన్ని దాటే ప్రక్రియ ప్రారంభమైంది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం వల్ల సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరప్రాంత గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వాతావరణశాఖ వివరాల ప్రకారం, తుపాను పూర్తి స్థాయిలో తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. కాకినాడకు 110 కి.మీ, విశాఖకు 220 కి.మీ దూరంలో తుపాను కేంద్రం కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

సముద్రాన్ని శాంతించాల్సిందిగా వేడుకుంటున్న తీరప్రాంత వాసులు

తుఫాను ప్రభావం విస్తరణ – వర్షాలు, గాలులు, అప్రమత్తం

1. మచిలీపట్నం, కాకినాడకు వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
2. తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వరకు విస్తరించిందని అధికారులు తెలిపారు.
3. విశాఖ, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి.
4. బుధవారం నాటికి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీవర్షాల అవకాశం ఉంది.
5. కోనసీమ, తూర్పు–పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ వి. ప్రఖర్ జైన్ తెలిపారు.
6. తుపాను ప్రభావం కొనసాగుతుండటంతో పలు తీర గ్రామాల్లో అధికారులు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
7. 3,174 పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉండగా, 3,778 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.

తీర ప్రాంతాలలో  పోటెత్తిన సముద్రం – ప్రజలను బీచ్​లనుండి పంపేస్తున్న పోలీసులు

తీరాన్ని తాకిన సమయంలో అంతర్వేదిపాలెం, ఉప్పాడ, కోనసీమ తీరప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

1. పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది ప్రజలను తీరానికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

2. మత్స్యకారులు తమ పడవలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

3. బీచ్‌ల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

4. డ్రోన్‌ల ద్వారా తుపాను ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు.