నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్లో కలిసి పరామర్శించారు
జైలులో పరామర్శ.. ప్రజావ్యతిరేకతతో ఓడలేదని కామెంట్
విధాత : నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం ములాఖత్లో కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన జగన్ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం రాజకీయ కక్షతో వైసీపీ నేతలపైన అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు.
పిన్నెల్లి మీద అన్యాయంగా కేసులు పెట్టి నిర్బంధించారని వైఎస్ జగన్ అన్నారు. కారంపూడి ఘటన తర్వాత తొమ్మిది రోజులకు పిన్నెల్లిపై 307 కేసు పెట్టారని తెలిపారు. కారంపూడిలో టీడీపీ అకృత్యాలకు దళిత కుటుంబం ఇబ్బంది పడిందని అన్నారు. డీఎస్పీ అనుమతితోనే వైసీపీ కార్యకర్తల పరామర్శకు పిన్నెల్లి వెళ్లారని.. అప్పుడు సీఐ నారాయణ స్వామి కనీసం ఆయనకు ఎదురుపడలేదని చెప్పారు.తాము అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ చూడలేదని వైఎస్ జగన్ చెప్పారు.
ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి మంచి చేశామని తెలిపారు. కానీ ఈ రోజు కేవలం టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని.. వైఎస్సార్ విగ్రహాలను తగులబెడుతున్నారని అన్నారు.
ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల్లా పెరిగిపోతున్నాయని తెలిపారు. దాడులతో భయపెట్టి చేసే రాజకీయాలు సిరికాదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ప్రజల్లో వ్యతిరేకత కారణంగా ఓడిపోలేదని జగన్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల పది శాతం మంది ఇటు నుంచి అటు వెళ్లారని చెప్పారు. అంతేతప్పితే తమ మీద ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టంచేశారు.