మాజీ జేడీ..జై భారత్ పార్టీ అధ్యక్షుడు వి.వి. లక్ష్మీ నారాయణ
విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలని సీబీఐ మాజీ జేడీ..జై భారత్ పార్టీ అధ్యక్షుడు వి.వి. లక్ష్మీ నారాయణ తెలిపారు. వాళ్లు ఇచ్చిన అన్ని హామీలు అమలు నెరవేరాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్నందునా ప్రత్యేక హోదా డిమాండ్ చేసే పరిస్థితి లేదని వైఎస్ జగన్ గతంలో చెప్పారని జేడీ లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.
కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయని.. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు.
ఈ ఐదేళ్లు చాలా కీలకమని.. ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం బాగుపడదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా లేకపోతే కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి.. గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే ఎక్కువగా చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ నార్త్ లో పోటీ చేసిన లక్ష్మీ నారాయణ డిపాజిట్ కోల్పోయి ఘోర పరాభవం ఎదుర్కోన్నారు. కేవలం 5,160 ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచారు. ఇక్కడ గాజుగ్లాసు గుర్తు వచ్చిన స్వతంత్ర అభ్యర్థి శిరీషకు 5,311 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. ఆయనకు 1,08,801 ఓట్లు రాగా, సమీప వైసీపీ ప్రత్యర్థి కామిల్ల కన్నప్పరాజుకు 61,267ఓట్లు వచ్చాయి.