Andhra Pradesh : అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో వర్షపాతం, పిడుగులు. తీరం వెంట బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక.

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రానున్న 48 గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్ గడ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి అనుబంధంగా ఛత్తీస్ గఢ్ , విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నెల 14న శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
శనివారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలో 87. 2మిమీ, గుంటూరు జిల్లా పెదకాకానిలో 77.2మిమీ, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 75మిమీ, గుంటూరు జిల్లా వల్లభపురంలో 74మిమీ, గుంటూరులో 72. 2మిమీ,నూజివీడులో 71మిమీ, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 70.7మిమీ,కౌతవరంలో 70.2మిమీ, ప్రకాశం జిల్లా దర్శిలో 68.5మిమీ
చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన 47 ప్రాంతాల్లో 40 మి.మీ.కు పైగా వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.