విధాత: ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి పట్టణం నీరు గట్టుపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ (30) అనుమానస్పద స్థితిలో మరణించాడు. కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కణసానోలపల్లి చెరువులో కులవర్ధన్ శవమై తేలినట్లు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి మదనపల్లిలోని మార్చరీకి తరలించారు. కులవర్ధన్ ఎలా చనిపోయాడన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఓ వైపు కులవర్ధన్ చేతిలో హత్యకు గురైన బాలిక అంత్యక్రియలు కొనసాగుతుండగానే..ఇంకోవైపు నిందితుడు మృతి చెందడం సంచలనంగా మారింది.
బాలికను చంపి డ్రమ్ములో దాచిన నిందితుడు
మదనపల్లి పట్టణం కాట్లాటపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె (7) సోమవారం సాయంత్రం 4.30 గంటలకు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో బాలిక చివరిసారిగా కులవర్ధన్ తో కనిపించడం.. సీసీ కెమెరాల విశ్లేషణ ఆధారంగా అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. బాలికను హత్య చేసి డ్రమ్ములో కుక్కినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిగా కులవర్ధన్ గా గుర్తించారు. కులవర్ధన్ కోసం పోలీసులు గాలిస్తుండగానే అతడు శవమై తేలడం చర్చనీయాంశమైంది.
