ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనే ఈ రాష్ట్రానికి పుర్వ వైభవం తీసుకొస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు
విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనే ఈ రాష్ట్రానికి పుర్వ వైభవం తీసుకొస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు. వైసీపీ, టీడీపీలకు ఇప్పటికే అధికారం ఇచ్చి చూశారని, కనీసం రాజధాని కూడా నిర్మించలేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అనంతరం కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ పట్టించుకోకపోవడంతో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ప్రజలంతా సానుకూల దృక్పదంతో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఈ దేశాన్ని పాడు చేస్తుంది భారతీయ జనతా పార్టీయే అన్నారు. విభజన పంపకాలకు సంబంధించి ఏపీలో ఏ ముఖ్యమంత్రి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చుని పరిష్కరిస్తారన్నారు. కాంగ్రెస్లో సీఎంగా ఉన్న రేవంత్రెడ్డికి బీజేపీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని, ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆరెస్ దీనిపై దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆరెస్, బీజేపీలు ఈ రకమైన అసత్య ప్రచారాలు సాగిస్తున్నాయని మండిపడ్డారు.