ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బీజేపీ నేత దినకర్, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, జనసేన నేత గౌతమ్ మోడీ పర్యటన కార్యక్రమం వివరాలను వెల్లడించారు.
ఏపీలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో దూకుడుగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఒకవైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి పార్టీ తగ్గేదేలే అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మేం సిద్ధం పేరుతో జగన్ జనాల్లోకి వెళ్తే, చంద్రబాబు ప్రజాగళం పేరుతో జనాల్లోకి వెళ్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బీజేపీ నేత దినకర్, తెలుగుదేశం మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, జనసేన నేత గౌతమ్ మోడీ పర్యటన కార్యక్రమం వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం బీజేపీ రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి, ఏపీ బీజేపీ చీఫ్ డి.పురంధేశ్వరి అభ్యర్థిత్వానికి మద్దతుగా ఈ నెల 6న మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీతో కలిసి ప్రసంగించనున్నారు.
అదే రోజు సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి జిల్లా కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అభ్యర్థిత్వానికి, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు చెందిన ఇతర అభ్యర్థులకు మద్దతుగా మోదీ ప్రసంగిస్తారు. మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు కలికిరిలో రాజంపేట లోక్ సభ అభ్యర్థి ఎన్ .కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వానికి, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు మద్దతుగా మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీతో కలవనున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తారు.
అయితే గత ఎన్నికల్లో మోడీషా ద్వయం సౌత్ ఆపరేషన్ నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఒక్క తెలంగాణలో ఆశించిన మేర రిజల్ట్స్ వచ్చి కమలం గ్రాఫ్ పెరిగింది. ఓటు బ్యాంకు పెంచుకోవడంతో పాటు తెలంగాణలో 8 స్థానాలు దక్కించుకొని తమ ఉనికిని చాటుకుంటోంది. అయితే తెలంగాణతో పోల్చితే ఏపీలో బీజేపీకి ఏమాత్రం క్రేజ్ లేదు. అందుకే ఎన్నికల వ్యూహంలో భాగంగా బీజేపీ టీడీపీ, జనసేన జతకట్టింది. 25 అసెంబ్లీ, ఎనిమిది ఎంపీ సీట్ల కోసం పోటీ పడిన బీజేపీకి కేవలం ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ స్ధానాలు దక్కాయి. కనీస స్థానాలు దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. 2024 ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటనకు వస్తుండడంతో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది