RTC free buses Tirumala | తిరుమలలో ఆర్టీసీ ఉచిత బస్సులు.. శ్రీవారి ధర్మరథం తిరిగే మార్గంలోనే

RTC free buses Tirumala | తిరుమలలో ఆర్టీసీ ఉచిత బస్సులు.. శ్రీవారి ధర్మరథం తిరిగే మార్గంలోనే

RTC free buses Tirumala |  తిరుమ‌ల‌ కొండపై భ‌క్తుల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్ స‌ర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉచిత ఆర్టీసీ బస్సులను తిరుమ‌ల‌లోని అశ్వినీ ఆసుప‌త్రి స‌ర్కిల్ వ‌ద్ద గురువారం టీటీడీ అద‌న‌పు ఈవో సీ.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాలు (ఉచిత బస్సులు) తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బ‌స్సులు తిరుగుతూ ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి భ‌క్తుల‌ను ఉచితంగా చేర‌వేస్తాయ‌ని వెల్లడించారు. తిరుమ‌ల‌లో భక్తుల నుంచి ప్రైవేటు వాహ‌నాల వారు అధికంగా డబ్బులు వసూలు చేయడాన్ని అరికట్టేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు బ‌స్సుల‌ను ఉచితంగా తిప్పాల‌ని ఏపీఎస్ ఆర్టీసీని కోరిన‌ట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం తిరుమలలో బ‌స్సుల‌ను ఉచితంగా నడిపేందుకు ముందుకు రావ‌డం హర్షించదగ్గ విషమయన్నారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీ ఉచిత ట్రిప్పుల ద్వారా భ‌క్తుల‌కు, ఆర్టీసీకి అద‌న‌పు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే టీటీడీ శ్రీ‌వారి ధ‌ర్మ ర‌థాల ద్వారా తిరుమ‌ల‌లో ప్ర‌తిరోజూ 300 ట్రిప్పుల‌ను తిప్పుతోంద‌ని చెప్పారు. ఆర్టీసీ బ‌స్సులు తోడ‌వ్వ‌డంతో అద‌నంగా 80 ట్రిప్పులు తిప్పేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌తి రెండు నిమిషాల‌కు బ‌స్సులు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బ‌లోపేతమవ్వ‌డంతో పాటు బ‌హుముఖ ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చెప్పారు.

భ‌క్తులు బ‌స్టాండ్ వ‌ద్ద‌కు రాకుండా తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బ‌స్సులను ఎక్క‌డం ద్వారా నేరుగా తిరుప‌తికి వెళ్లేందుకు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో ఏ ప్రాంతంలో బ‌స్సు ఎక్కినా తిరుమ‌ల నుండి తిరుప‌తికి మాత్ర‌మే ఛార్జీలు ఉంటాయ‌ని, ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు లేకుండా ఉచితంగా ఈ స‌ర్వీసుల‌ను భ‌క్తులు వినియోగించుకోవాల‌ని ఆయ‌న భ‌క్తుల‌ను కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ పైడి చంద్ర‌శేఖ‌ర్, టీటీడీ ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, తిరుప‌తి జిల్లా ప్ర‌జా ర‌వాణా అధికారి శ్రీ వెంక‌ట‌రావు, డిప్యూటీ సీటీఎం శ్రీ విశ్వ‌నాథ్‌, డిప్యూటీ సీఎంఈ, శ్రీ బాలాజీ, అలిపిరి డిపో మేనేజ‌ర్ శ్రీ‌హ‌రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.