Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం పెద్ది ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, చిత్రబృందం సభ్యులు కూడా సినిమా విజయంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సినిమా విడుదలకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న జాన్వీ కపూర్, స్వామివారి దర్శనం కోసం కాలినడకన కొండ ఎక్కారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా మొత్తం 3,550 మెట్లు అధిరోహించి తిరుమల చేరుకున్న ఆమె భక్తి అందరినీ ఆకట్టుకుంది. సాధారణ గులాబీ రంగు ఎథ్నిక్ డ్రెస్‌లో కనిపించిన జాన్వీ, భక్తులతో కలిసి నడుచుకుంటూ వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంప్ర‌దాయ ప‌ట్టు చీర‌లో ద‌ర్శ‌నం..

తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం జాన్వీ సంప్రదాయ పట్టు చీరలో కనిపించారు. ఆలయ దర్శనం ముగిసిన తర్వాత ఆలయం వెలుపల సాష్టాంగ నమస్కారం చేసి తన భక్తిని చాటుకున్నారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉండటం విశేషం.

జాన్వీ కపూర్‌కు తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. తన పుట్టినరోజు, అలాగే తల్లి శ్రీదేవి జయంతి వంటి ముఖ్యమైన సందర్భాల్లో స్వామివారిని దర్శించుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. ఇప్పుడు ‘పెద్ది’ విడుదల సందర్భంగా కూడా సినిమా విజయవంతం కావాలని ప్రార్థిస్తూ తిరుమలేశుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అచ్చియ‌మ్మ పాత్ర‌లో జాన్వీ..

ఇక ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే పాత్రలో నటించారు. రాజకీయ నాయకురాలి కుమార్తెగా, ధైర్యవంతమైన యువతిగా ఆమె పాత్ర సాగుతుంది. రామ్ చరణ్ సరసన ఆమె నటనకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ గ్రామీణ నేపథ్యంలో పెరిగిన యువకుడిగా, క్రికెట్, రెజ్లింగ్, స్ప్రింటింగ్ రంగాల్లో రాణించే అథ్లెట్‌గా కనిపించారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా విడుదల రోజునే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.

సినిమా విజయాన్ని కోరుకుంటూ తిరుమలలో జాన్వీ చేసిన ప్రత్యేక ప్రార్థనలు ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘పెద్ది’ విజయవంతం కావాలని కోరుకుంటూ ఆమె చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.