Rape Attempt On Minor Girl : మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచార యత్నం

కాకినాడ జిల్లా తునిలో 8వ తరగతి చదువుతున్న మైనర్ దళిత బాలికపై కొండవారిపేట కౌన్సిలర్, దళిత నాయకుడు నారాయణరావు అత్యాచార యత్నం కలకలం రేపింది. బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Oct 22, 2025, 1:41 pm IST
Read Time: 4 mins
Rape Attempt On Minor Girl : మైనర్ బాలికపై వృద్ధుడి అత్యాచార యత్నం

అమరావతి : కాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. అయితే తాను అమ్మాయిపై అత్యాచార యత్నం చేయలేదంటూ నారాయణరావు వాదిస్తున్నాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నారాయణ రావును అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని శిక్షించాలంటూ గురుకుల పాఠశాల వద్ద బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు బాలికపై 3 సార్లు అత్యాచారం జరిగిందని..గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రక్షణ లేదు అని ఆరోపించారు. నారాయణ రావును కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. పాఠశాల నిర్వహకులు బాలికతో ఎలాంటి సంబంధం లేని నారాయణరావుతో ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతోనే అతనిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి.. అతడిని శిక్షించే వరకూ ఊరుకోం అని హెచ్చరించారు.

నేను కొత్తగా వచ్చాను.. పిల్లల పేరెంట్స్ పరిచయం లేదు

నేను గరుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా కొత్తగా వచ్చానని ఇన్ చార్జీ ప్రిన్సిపాల్ తెలిపారు. గతంలో కూడా నారాయణరావు నాలుగు సార్లు వచ్చి బాలికను తీసుకెళ్లారు అని, నారాయణ రావు తన తాత అని బాలిక చెప్పడం వల్లే పంపించాం అని వెల్లడించారు. వచ్చిన వ్యక్తితో పంపించవచ్చా లేదా అని పాఠశాల టీచర్లను అడిగానని..వారు ఆ బాలిక తాత అని చెప్పడంతోనే ఆమెను బయటకు పంపించామని ప్రిన్సిపాల్ వివరించారు.