Ys Sharmila : ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చకండి

ఆరోగ్యశ్రీకి రూ. 2700 కోట్ల బకాయిలు చెల్లించనందున ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపివేయడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని 'అనారోగ్యశ్రీ'గా మార్చవద్దని, వెంటనే బకాయిలు చెల్లించి సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

Ys Sharmila : ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చకండి

విధాత : 19 ఏళ్ల ఆరోగ్యశ్రీ చరిత్రలో నేడు దుర్దినం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. చేసిన వైద్యానికి బిల్లుల ఇవ్వాలని ఆసుపత్రులు రోడ్డెక్కడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రూ.2700 కోట్లు బకాయిలు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇంత జరుగుతున్నా మౌనం వహించడం చంద్రబాబు మూర్ఖపు చర్యకు నిదర్శనం అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యం అందక జనం గగ్గోలు పెడుతుంటే చోద్యం చూడటం అత్యంత దారుణం అని దుయ్యబట్టారు. 15 రోజులుగా వైద్య సేవలు నిలిపేసి లక్షమంది రోగులను తిప్పి పంపించారని మండిపడ్డారు. సర్జరీలు జరగక పేదలు నానా అవస్థలు పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అయినా బిల్లుల చెల్లించడాని కూటమి ప్రభుత్వానికి మనసు కరగలేదు అని షర్మిల విమర్శించారు.

పేదల ఆర్తనాదాలు ప్రభుత్వానికి పట్టింపు లేదని, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ని నిర్వీర్యం చేసి పూర్తిగా చంపే కుట్ర చేస్తున్నదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. పేదోడికి ఉచిత వైద్యం దూరం చేయాలని చూస్తున్నారన్నారు. వైద్యం కోసం మళ్ళీ ఆస్తులు అమ్ముకోవాలని చెప్పకనే చెప్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బకాయిల చెల్లింపునకు ప్రభుత్వమే బేరసారాలకు దిగడం సిగ్గుచేటు అని షర్మిల అన్నారు. చేసిన వైద్యానికి బిల్లులు పెండింగ్ పెట్టడం కూటమి ప్రభుత్వ దిక్కుమాలిన చర్యకు అద్దం పడుతున్నదని విమర్శించారు. స్ట్రెచర్ పైనున్న ఆరోగ్యశ్రీ భారాన్ని వెంటనే దించండి అని ముఖ్యమంత్రి చంద్రబాబును మళ్ళీ డిమాండ్ చేస్తున్నామన్నారు.

సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చకండి అంటూ ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి చేశారు. పథకానికి రాజకీయాలను ఆపాదించొద్దని కోరారు. 250 కోట్లు ఇచ్చినంత మాత్రానా ప్రజారోగ్యంపై మీకు ప్రేమ ఉన్నట్లు కాదని.. చిల్లర విదిలించి చేతులు దులపాలని చూడటం భావ్యం కాదన్నారు. వెంటనే రూ.2700 కోట్లు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలన్నారు. ఆరోగ్యశ్రీ అందక రాష్ట్రంలో ఏ ఒక్కరూ మృత్యువాత పడినా అవి ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని వైఎస్ షర్మిల హెచ్చరించారు.