CM Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కేసు నమోదుచేసింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి అతిషి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈడీ శనివారం సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి సమన్లు పంపిందని.. నకిలీ కేసులో సమన్లు అందాయన్నారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. సమన్లలో ఎలాంటి వివరాలు లేవన్నారు. ఢిల్లీ జల్ బోర్డు విషయం ఎవరికీ తెలియదని అతిషి పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగలరా? అనే సందేహం ప్రధాని మోదీకి కలుగుతున్నందున ఈ సమన్లు పంపుతున్నారన్నారు. సీఎంను అరెస్టు చేసేందుకు బ్యాకప్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
మద్యం పాలసీ కేసులో ఇప్పటి వరకు ఈడీ కేజ్రీవాల్కు తొమ్మిదిసార్లు సమన్లు పంపింది. చివరిసారిగా నోటీసులు పంపిన ఈడీ మార్చి 21న విచారణకు రావాలని కోరారు. ఇంతకు ముందు కేజ్రీవాల్ ఈడీ ఎనిమిది సార్లు సమన్లు పంపింది. అయితే, ఏ ఒక్కసారి ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరవలేదు. తాజాగా సమన్లు పంపుతూ విచారణకు రావాలని కోరింది. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను కోర్టు స్వీకరించింది. రోస్ అవెన్యూ కోర్టు నుంచి సీఎం బెయిల్ పొందారు. కేజ్రీవాల్ బెయిల్ దరఖాస్తును స్వీకరించిన కోర్టు రూ.15వేల పూచీకత్తు, రూ.లక్ష సెక్యూరిటీ బాండ్పై బెయిల్ మంజూరు చేసింది. సమన్లు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఈడీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించిన కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది.