హర్ధిక్ పాండ్యా యూజ్ అండ్ త్రో పర్సన్.. నిప్పులు చెరిగిన ఇర్ఫాన్

మరి కొద్ది నెలలో ఐపీఎల్ జరగనుంది. ఇప్పటి నుండే ఐపీఎల్పై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎవరు ఏ టీంలో ఉండనున్నారు, ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతుంది వంటి వాటిపై ఆసక్తికర డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ను హార్దిక్ పాండ్యా వీడుతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళతాడని కొందరు చెప్పుకొస్తున్నారు. క్యాష్ ట్రేడింగ్లో భాగంగా గుజరాత్ టైటాన్స్కు రూ. 15 కోట్లు చెల్లించి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై అటు గుజరాత్ టైటాన్స్ కాని అటు ముంబై ఇండియన్స్ కాని ఇప్పటి వరకు స్పందించలేదు. కాని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఒకటి ఇరు జట్ల పరస్పర అంగీకారంతో క్యాష్ ట్రేడింగ్ డీల్ పూర్తైనట్టు స్పష్టం చేసింది. అయితే ఈ డీల్ లో గుజరాత్ టైటాన్స్ను వీడినందుకు హార్దిక్ పాండ్యాకు భారీ డబ్బుతో పాటు కొన్ని వ్యాపార ప్రకటనలకి సంబంధించిన ఒప్పందాలను ఆఫర్గా ముంబై ఇండియన్స్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. ఇది పూర్తిగా వ్యాపార కోణంలో జరిగినట్టు తెలుస్తుండగా, దీనిపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ నిప్పులు చెరిగారు.
ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పటాన్ ఓ ట్వీట్ చేశాడు. ‘యూజ్ అండ్ త్రో అనేది ప్రారంభం నుంచి ఉన్న నిజమైన లక్షణం అంటూ పఠాన్ ట్వీట్ చేయగా, అది పాండ్యా గురించే అని డిస్కషన్ నడుస్తుంది. అతను జట్టుని వీడుతున్న సమయంలో పఠాన్ పేరు మెన్షన్ చేయకుండా ట్వీట్ చేయగా, అది హార్ధిక్ గురించే అయి ఉంటుందని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక నెటిజన్స్ సైతం పఠాన్కి సపోర్ట్గా ఉంటూ హార్ధిక్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కోట్ల రూపాయల చీకటి ఒప్పందమని కొందరు ఆరోపిస్తున్నారు.