Madhya ప్రదేశ్ | అటు శాసనసభకు, ఇటు పార్లమెంట్కు ఎన్నికయ్యే వారిలో చాలా మంది ధనికులే ఉంటారు. కోట్లకు కోట్లు గుమ్మరించి ఎన్నికల్లో గెలుస్తుంటారు. గెలిచిన తర్వాత అంతకు అంత డబ్బును సంపాదిస్తారు. ఇది అందరికి తెలిసిన బహిరంగ సత్యం. అయితే మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల వేళ.. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ఒక కీలక నివేదికను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 81 శాతం మంది కోటీశ్వరులు అని ఏడీఆర్ రిపోర్టు తేల్చింది. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల ఆదాయం సగటున రూ.10.76 కోట్లుగా ఉంటుందని తెలిపింది. 2008 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సగటు ఆదాయం 1.44 కోట్లు ఉండగా, 2013 ఎన్నికల నాటికి రూ. 5.24 కోట్లకు చేరింది.
కోటీశ్వరుల్లో చాలా మంది బీజేపీ నుంచే ఉన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మొత్తం 129 మంది బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇందులో 107 మంది కోటీశ్వరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఉన్న 97 మంది ఎమ్మెల్యేల్లో 76 మంది కోటీశ్వరులు. నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.
2008లో కేవలం 84 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కోట్ల ఆస్తులను కలిగి ఉండగా, 2013లో 161 మంది, 2018లో 186 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. 2013లో 118 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. 2018 నాటికి ఆసంఖ్య 107కు తగ్గింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయానికి వస్తే 2013లో 40 మంది ఉండగా, 2018 నాటికి ఆ సంఖ్య 97కు పెరిగింది.
రిచెస్ట్ ఎమ్మెల్యే సంజయ్ పఠాక్
మధ్యప్రదేశ్లో రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే సంజయ్ పఠాక్. మాజీ మంత్రి ఈయన. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రూ.226 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. 2013లో పఠాక్ ఆస్తులు రూ.141 కోట్లు మాత్రమే. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ రూ.124 కోట్లతో కోటీశ్వరుల జాబితాలో ఆరోస్థానంలో ఉన్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రూ. 7 కోట్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉన్నారు.
నిరుపేద ఎమ్మెల్యేలు ఎవరంటే..?
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యంత నిరుపేదలని ఏడీఆర్ రిపోర్టులో వెల్లడైంది. బీజేపీ తరపున తొలిసారి శాసనసభకు ఎన్నికైన రామ్ దంగోరే ఆస్తులు కేవలం రూ.50వేలు మాత్రమే. మంత్రి ఉషా ఠాకూర్ ఆస్తులు రూ. 7 లక్షలు మాత్రమే. ఎమ్మెల్యే శరద్ కోల్ ఆస్తి కూడా రూ. 8.4 లక్షలు మాత్రమే.
40 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..
230 మంది ఎమ్మెల్యేల్లో 40 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 20 శాతం మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు ఏడీఆర్ వెల్లడించింది. 129 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై, 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.
230 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరే నిరక్ష్యరాసుడు
230 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 55 మంది గ్రాడ్యుయేట్లు, 39 గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్, ఐదుగురు డాక్టరేట్లు, నలుగురు ప్రొఫెషనల్ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు. ఇక 35 మంది పన్నెండో తరగతి వరకు చదివారు.12 మంది పది, ఏడుగురు 8వ తరగతి, ఎనిమిది మంది ఐదో తరగతి పాసయ్యారు. మరో నలుగురు అక్షరాస్యులు కాగా, ఒక్కరికి మాత్రమే చదువు రాదు.