అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఇండ్ల స్థ‌లాలు ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టులుగా ప‌ని చేస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభ‌వార్త వినిపించారు. అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఇండ్ల స్థ‌లాలను ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తుంద‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఇండ్ల స్థ‌లాలు ఇస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టులుగా ప‌ని చేస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభ‌వార్త వినిపించారు. అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఇండ్ల స్థ‌లాలను ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తుంద‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీ (జేఎన్‌జే)కి సంబంధించి ఇండ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె. శ్రీనివాసరెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్డుమ్యాప్‌తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్‌ ఛైర్మన్‌ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించానంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందని అన్నారు.

శుక్రవారం సాయంత్రం జేఎన్‌జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రధాన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి జేఎన్‌జేకు కేటాయించిన ఇండ్ల‌ స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హమీని అమలు చేసినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.

సొసైటీ ప్రస్థానం గురించి జేఎన్‌జే ‌ ప్రతినిధులు వివరిస్తూ 16 ఏండ్ల‌ కిందట కాంగ్రెస్‌ ప్రభుత్వమే నిజాంపేట, పేట్‌బషీర్‌బాద్‌లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్‌జేకు కేటాయించిదని సీఎంకు తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలు కాలేదని… ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు. ఈ సొసైటీలోని 60 మంది సభ్యులు ఇప్పటికే మరణించారని.. మరో 20 మంది సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాలేదని సీఎంకు వివరించారు. సొసైటీ సభ్యులు మరణించడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

జేఎన్‌జే కాకుండా మిగిలిన సోసైటీల‌ జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడామీతో చర్చించి కార్యాచ‌ర‌ణను రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపై కూడా దృష్టిసారించామని తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్రరెడ్డి కూడా పాల్గొన్నారు.