సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రాజకీయాలలో అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నాయి. వలసలు, చేరికలతో ఈ సారి పోటి గట్టిగానే ఉంటుందని అర్ధమవుతుంది. అయితే ఈ సారి రాజకీయాలకి సినీ గ్లామర్ కూడా బాగానే తోడు అవుతుందని అర్ధమవుతుంది. కొందరు తమకి నచ్చిన పార్టీలకి ప్రచారం చేయాలని చూస్తుండగా, మరి కొందరు ఏకంగా సదరు పార్టీలలోకి వెళుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నేత నారా లోకేష్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకి మరి కొద్ది రోజుల ముందు నిఖిల్ టీడీపీలో చేరడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
నిఖిల్ రాజకీయాల్లోకి వెళతాడని కొన్నాళ్లుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఏనాడు దీనిపై ఆయన స్పందించింది లేదు. దాంతో అవన్నీ పుకార్లే అని అందరు అనుకున్నారు. కాని సడెన్గా ఇలా టీడీపీ కండువా కప్పుకోవడం అందరికి సర్ప్రైజ్గా అనిపించింది. అయితే నిఖిల్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడా? లేదా? ఎవకిరైన సపోర్ట్ చేస్తాడా అని ఆలోచనలు చేస్తున్నారు.మేటర్లోకి వెళితే బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్య యాదవ్కు నిఖిల్ అల్లుడి వరుస అవుతారు. ఆయన తరపున నిఖిల్ ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైన నిఖిల్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో టీడీపీ అభిమానులు, శ్రేణులు, కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది.
నిఖిల్.. చీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య యాదవ్కు అండగా ఎన్నికల ప్రచారంలో చేస్తే మాత్రం చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు నిఖిల్కి పాన్ ఇండియా క్రేజ్ ఉంది. కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు అంత క్రేజ్ ఉన్న హీరో టీడీపీకి మద్దతు ఇవ్వడం శుభపరిణామం అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం ‘స్వయంభు’ చిత్రంలో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్గా నటిస్తుంది. మరోవైపు, దర్శకుడు చందు మొండేటి ‘కార్తీకేయ 3’ని ప్రకటించగా,ఈ మూవీ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.