రాముడి పేరుతో మారోసారి ఓట్లు దండుకునే యత్నంలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తున్నది. అయోధ్యలో ఆలయం ప్రారంభం కాగానే ఇంటింటికీ తలంబ్రాలు పంపిణీ చేస్తారని సమాచారం.
(విధాత ప్రత్యేకం)
రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ కాషాయ అజెండానే నమ్ముకున్నదా? వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటున్న నేపథ్యంలో మళ్లీ మతం కార్డు తమను గట్టెక్కిస్తుందని భావిస్తున్నదా? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇప్పటికే జ్ఞాన్వాపి మసీదు వ్యవహారం నలుగుతుండగానే.. మళ్లీ శ్రీకృష్ణజన్మభూమి వ్యవహారాన్ని రాజేస్తున్నది. అటు కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసింది. వీటన్నింటి కంటే మించి.. ప్రజలను భక్తి మాయలో ముంచేసేందుకు వారికి ఇష్టమైన శ్రీరాముడిని మళ్లీ అస్త్రంగా వాడుకునేందుకు సిద్ధమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా తలంబ్రాల పంపిణీ
అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీరాముడి తలంబ్రాలను పంపిణీ చేయాలని బీజేపీ-సంఘ్పరివార్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఒక్కో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో తలంబ్రాల బస్తాలను పంపారని సమాచారం. వాటికి తోడు స్థానికంగా మరిన్ని తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగగానే.. ఇక్కడ అదే సమయంలో ఇంటింటికీ శ్రీరాముడి తలంబ్రాలను పంపిణీ చేయనున్నారని తెలుస్తున్నది. ఈ పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని కూడా సిద్ధం చేశారని విశ్వసనీయ సమాచారం.
మోదీ ఉపన్యాసం లైవ్ కవరేజీ
మరోవైపు 22వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా చేసే ఉపన్యాసాన్ని దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు, హిందూత్వ సంస్థల ప్రాంగణాల్లో లైవ్ కవరేజీ ద్వారా భక్తులకు వినిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అందుకోసం ఆయా ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు. ఢిల్లీలో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రారంభోత్సవం తర్వాత అయోధ్యకు తీసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి ప్రజలను అయోధ్య తరలించాలని చూసినప్పటికీ కేవలం పది పదిహేనువేల మంది అతిథులకు మాత్రమే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో వీవీఐపీలు సైతం రావొద్దని అయోధ్య ట్రస్టు పేర్కొనడం సంచలనం రేపింది. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ముందు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మొత్తంగా రాముడి అజెండా చుట్టూ ఎన్నికలను తిప్పి.. ఆ ముసుగులో ఓట్లు దండుకోవడానికి బీజేపీ చేస్తున్న ఎత్తుగడగా కూడా దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ మూడ్ నుంచి ప్రజలు బయటకు రాకముందే లోక్సభ ఎన్నికలు నిర్వహించే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించడం, ఆ మేరకు టెన్త్ పరీక్షలను ఏపీలో ముందుకు మార్చడం గమనార్హం.
రాజకీయ లాభం ఆశిస్తున్న కాషాయ పార్టీ
నిజానికి ఇద్దరు ఎంపీలున్న బీజేపీని అధికారం దిశగా నడిపించింది రామ మందిరం. ప్రజల విశ్వాసాన్ని సరిగ్గా పట్టుకున్న బీజేపీ.. ప్రజల మత విశ్వాసాన్ని ఆధారం చేసుకునే హిందూత్వ అజెండాను అమలు చేసింది. ఒకప్పుడు తాము ఇచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకున్నామని చాటడం ద్వారా మరో దఫా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలో ఉన్నది. ఇప్పటికే ఆరెస్సెస్, వీహెచ్పీ వంటి సంస్థలు ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జన్ఉత్సవ్లు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఇదంతా ప్రజలను ఎన్నికల దాకా ఇదే మూడ్లో ఉంచడమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామమందిరం బీజేపీకి మూడు రకాలుగా రాజకీయం లబ్ధి చూకూర్చుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొదటిది ఈ ప్రాంతంపై దీర్ఘకాలికంగా సాగిన వివాదాన్ని పరిష్కరించి, అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని చెప్పుకోవడం. మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చుతారని తాజాగా బీజేపీ నేతలు చెప్పుకొంటున్న దానికి మరోటి అదనంగా తోడైనట్టు అవుతుంది. ఇక చివరిది రాబోయే ఎన్నికల్లో హిందూ ఓటర్లను ఆకర్షించడం. బీజేపీ మరోమారు భారీ స్థాయిలో తీసుకువస్తున్న హిందూత్వ ఎజెండాకు దీటుగా స్పందించేందుకు ప్రతిపక్షాలు భారీ కసరత్తునే చేయాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుల గణన అంశం ఈ మధ్యకాలంలో కొంత చైతన్యాన్ని ప్రజల్లో కల్పిస్తున్నది. అయితే.. బీజేపీ విసిరే బలమైన హిందూత్వ పాచిక ముందు ఆ చైతన్యం నిలబడుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.