• Telugu News
  • /Breaking

Shirdi Saibaba Temple | మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్‌..! మరి సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుందా..?

Shirdi Saibaba Temple | ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన షిర్డీలో మే ఒకటో తేదీ నుంచి నిరవధిక బంద్‌ చేపట్టనున్నారు. షిర్డీ సాయిబాబా ఆలయానికి భద్రత కల్పించేందుకు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామస్తులు బంద్‌కు పిలుపునిచ్చారు. బాబా ఆలయానికి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని బోర్డు, ప్రభుత్వం నిర్ణయించగా గ్రామస్తులు వ్యతిరేకిస్తూ మరో నాలుగు డిమాండ్లను సర్కారు ముందుంచారు. వాస్తవానికి ఉగ్రవాదుల నుంచి ముంపు నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి […]

Reported by: Vineela | Breaking | IST
Read Time: 4 mins

Shirdi Saibaba Temple |

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన షిర్డీలో మే ఒకటో తేదీ నుంచి నిరవధిక బంద్‌ చేపట్టనున్నారు. షిర్డీ సాయిబాబా ఆలయానికి భద్రత కల్పించేందుకు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గ్రామస్తులు బంద్‌కు పిలుపునిచ్చారు.

బాబా ఆలయానికి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని బోర్డు, ప్రభుత్వం నిర్ణయించగా గ్రామస్తులు వ్యతిరేకిస్తూ మరో నాలుగు డిమాండ్లను సర్కారు ముందుంచారు. వాస్తవానికి ఉగ్రవాదుల నుంచి ముంపు నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి భద్రతను పెంచింది.

ప్రస్తుతం ఆలయంలో భద్రతను సాయి సంస్థాన్‌ నిర్వహిస్తుంది. ఆలయ ప్రాంగణంలో సెక్యూరిటీ బాధ్యతలు మహారాష్ట్ర పోలీసులు తీసుకున్నారు. భద్రతలో భాగంగా ప్రతి రోజూ బాంబ్‌ స్క్వాడ్‌తో ఆలయాన్ని తనిఖీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భద్రతా వ్యవస్థకు బదులుగా సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించాలని భావిస్తున్నారు.

దీనికి సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ సైతం మద్దతు తెలుపుతుండగా.. ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆలయానికి సీఐఎస్‌ఎఫ్‌ భద్రత వద్దని, సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రస్తుతం తాత్కాలిక కమిటీ కారణంగా అన్ని కార్యకలాపాలు నెమ్మదించాయని, దాని స్థానంలో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే సంస్థాన్ ట్రస్ట్‌ బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని, ఇందులో 50 శాతం ధర్మకర్తలు షిర్డీ నుంచి ఉండాలని కోరుతున్నారు.

ఈ మేరకు షిర్డీలో సమావేశమైన అఖిలపక్ష నేతలు, గ్రామస్తులు మహారాష్ట్ర దినోత్సవమైన మే ఒకటో తేదీ నుంచి షిర్డీలో నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. బంద్‌ సమయంలో భక్తుల కోసం ఆలయం తెరిచే ఉంటుందని, భక్తుల కోసం సాయి బాబా సంస్థాన్‎లో అన్ని సౌకర్యాలు కొనసాగుతాయని ప్రకటించారు. కానీ, ఇతర వ్యాపారాలు మాత్రం పూర్తిగా మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు.