Site icon vidhaatha

Ratan Tata | రతన్‌ టాటా కలల ప్రాజెక్టు నానో..! రూ.లక్ష కారు ఉద్దేశం ఏంటీ..? అసలు ఎందుకు మూతపడింది..!

Ratan Tata | టాటా మోటార్స్‌ (Tata Motors) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లోకి తీసుకువచ్చిన టాటా ఇండికా (Tata Indica) కారు కాస్త నిరాశకు గురి చేసింది. ఆ తర్వాత స్వల్ప మార్పులతో మార్కెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వగా.. విజయవంతంగా దూసుకుపోయింది. అదే క్రమంలో 2008 జనవరి 10న ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఆటో ఎక్స్‌పో జరిగింది. ఇందులో టాటా మోటార్స్‌ కొత్తగా ఏం తీసుకురాబోతుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే అప్పటికే టాటా మోటార్స్‌కు చెందిన సుమో, సియారా, సఫారీ, ఇండియా మోడల్స్‌ మార్కెట్‌పై ఆధిపత్యాన్ని చూపుతున్నాయి. అయితే, తొలిసారిగా మధ్యతరగతి కలలను సాకారం చేసేందుకు టాటా సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. అదే రతన్‌ టాటా (Ratan Tata) కలల ప్రాజెక్ట్‌ అయిన టాటా నానో (Tata Nano Car)ను ఆవిష్కరించింది. ఈ కారు మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకున్నది. ముంబయిలో ద్విచక్ర వాహనంపై కుటుంబమంతా ద్విచక్ర వాహనంపై వెళ్తుండడంతో చూసిన ఆయన మధ్యతరగతికి అందుబాటులోకి కారు తీసుకురావాలని భావించారు. రతన్‌ టాటా ప్రకటించిన విధంగానే రూ.లక్షకే విక్రయించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చాలామంది మధ్యతరగతి ప్రజలు నానో కారును కొనుగోలు చేశారు. అయితే, బుకింగ్‌.. డెలివరీ మధ్య చాలా మారుతూ వచ్చింది. అయితే, టాటా నానోను రూ.లక్షకే మార్కెట్‌లోకి తీసుకురావడం అంత తేలిగ్గా సాగలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

సింగూరు నుంచి సాణంద్‌కు టాటా నానో ప్లాంట్‌

మొదట టాటా మోటార్స్‌ పశ్చిమ బెంగాల్‌లోని సింగూరులో నానో ప్లాంట్‌ని నెలకొల్పింది. ఇందుకోసం రైతుల నుంచి భూములను కొనుగోలు చేసింది. ఇక్కడే ఫ్యాక్టరీ ఏర్పాటుతో నానో క్లా తయారీ ప్రక్రియ మొదలైంది. కొద్దిరోజులకే పనులు నిలిచిపోయే పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీఎంసీ అధినేత మమతా బెనర్జీ నేతృత్వంలోని రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. భారీ నిరసనల నేపథ్యంలో సింగూర్‌ ప్లాంట్‌ని మూసివేస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఆ తర్వాత గుజరాత్‌ సాణంద్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకు భూమిని ఇస్తామని అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీ ప్రకటించారు. దాంతో సింగూరు నుంచి సాణంద్‌కు ప్లాంట్‌ను తరలించారు. దాదాపు 2వేల కిలోమీటర్ల దూరం వరకు ప్లాంట్‌ను తరలించారు. మొత్తం 3,340 ట్రక్కులు, 495 కంటైనర్లలో ఫ్యాక్టరీని ఏడునెలల సమయంలో తరలించారు. దాదాపు 14 నెలల విరామం అనంతరం మళ్లీ నానో పనులు మొదలయ్యాయి. మార్కెట్‌లోకి వచ్చిన తొలి ఏడాది ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును నానో కైవసం చేసుకున్నది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత చవకైన కారుగా నిలిచింది.

బుకింగ్స్‌ పెరగడంతో లక్కీ డ్రా..

రూ.లక్ష కారుకు భారీగా డిమాండ్‌ ఉన్నది. మధ్యతరగతి ప్రజలంతా కారు కోసం బుకింగ్స్‌ చేసుకున్నారు. తారాస్థాయికి చేరుకోవడంతో బుకింగ్స్‌ కోసం సైతం లక్కీ డ్రాలు తయాల్సిన పరిస్థితి మొదలైంది. ఆ తర్వాత కారును రూ.లక్షకే అందివ్వడం కష్టతరంగా మారింది. ఇక ధరలు స్వల్పంగా పెంచాల్సి వచ్చింది. అయితే, రతన్‌ టాటా రూ.లక్షకే కారు ఇస్తామని ప్రకటించిన నాలుగేళ్ల తర్వాత కారు మార్కెట్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో కారు విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొంత వరకు నష్టాలను భరించి డెలివరీలు చేసినా.. చివరకు ధరలను పెంచక తప్పలేదు. ఆ తర్వాత అందరూ మారుతి ఆల్టో వైపు దృష్టి సారించారు. అప్పటికే నానోలో చాలా లోపాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. వాటిని సరి చేయడంతో పాటు కొత్త డెలివరీలు చేయడం ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో జనాలకు సైతం నానోపై ఆసక్తి తగ్గింది. 2014లో కార్ల సేఫ్టీకి రేటింగ్ ఇచ్చే గ్లోబల్ ఎన్‌సీఏ ఏకంగా నానోకు జీరో రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్‌ నానో భారీగా దెబ్బతీసింది. ఆ తర్వాత బుకింగ్స్‌ సైతం రద్దయ్యాయి. ఆ తర్వాత రతన్‌ టాటా నానో ఓ విఫల ప్రయోగమని ప్రకటించారు. కేవలం తక్కువ ధరకే కారును తీసుకురావాలనుకోలేదని.. అందరు మెచ్చేలా ఉండడంతో అందుబాటు ధరలో కారును తీసుకురావాలని భావించామన్నారు. వాస్తవానికి టాటా నానోను ఏడాదికి మూడు లక్షల వరకు విక్రయించాలని టాటా మోటార్స్‌ భావించింది. కానీ, లక్ష్యం నెరవేరలేదు. చివరకు నష్టాలను భరించలేక.. రతన్‌ టాటా, సైరస్‌ మిస్త్రీల వివాదం.. నాయకత్వం మార్పు మధ్య డిసెంబర్‌ 2019లో నానో ప్రాజెక్టును మూసివేసింది. అయితే, పదేళ్లలో కేవలం మూడులక్షల యూనిట్లను మాత్రమే టాటా విక్రయించింది.

నానో ఈవీ తెచ్చేందుకు ప్లాన్‌..

ఇటీవల టాటా మోటార్స్ నానోను ఈవీగా తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. 2010 జెనీవా మోటార్ షోలోనే నానా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను టాటా మోటార్స్ ప్రదర్శించింది. పది సెకన్లలోనే 160 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకునేలా సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఇప్పటికే 13 సంవత్సరాలు గడిచాయి. కొంతకాలం కిందట రతన్‌ టాటాను తాజ్‌ హోటల్‌కు నానో కారులో వెళ్లడం కనిపించింది. దాంతో మళ్లీ నానో ఈవీ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం టాటా మోటార్స్‌ ఈవీ రంగంలో దూసుకుపోతున్నది. టాటా పంచ్‌, నెక్సన్‌, టైగర్‌, టియాగో తదితర ఈవీ కార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. నానో కారును తీసుకువస్తే డిమాండ్‌ ఉంటుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Exit mobile version