US VISA fee : అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి ‘యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) షాకింగ్ న్యూస్ చెప్పింది. అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజును భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి (రేపటి నుంచి) అమల్లోకి రానుంది. హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు ఈ పెంపు వర్తిస్తుంది.
అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. ఈ వీసా ఫీజులను చివరిసారి 2016లో పెంచారు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు ఇప్పుడు మళ్లీ పెంచుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో ‘యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)’ పేర్కొంది.
కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము ప్రస్తుతం 460 డాలర్లు. రేపటి నుంచి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. అదేవిధంగా హెచ్1-బీ వీసా రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు 10 డాలర్లు (రూ. 829). రేపటి నుంచి 215 డాలర్లకు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది.
ఇక ఎల్-1 వీసా ఫీజు కూడా ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ.38,000) గా ఉంది. రేపటి నుంచి 1385 డాలర్లకు (రూ.1,10,000) పెరుగనుంది. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కిందకు వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయి.
ప్రస్తుతం 3,675 డాలర్లు (దాదాపు రూ.3 లక్షలు) గా ఉన్న ఈబీ-5 వీసా ఫీజు రేపటి నుంచి 11,160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగనుంది. ఈబీ-5 వీసాను యూఎస్ ప్రభుత్వం 1990లో ప్రారంభించింది. అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాల్లో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు ఈ ఈబీ-5 వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా వారి వ్యాపారం ఉండాలి.