నేచురల్ స్టార్ నాని స్వయం కృషితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కెరీర్లో మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరించారు. ఈ క్రమంలో స్టార్ హీరోగా కూడా ఎదిగారు. నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తుండగా, ఈ చిత్రం ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో రాబోతుంది. శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుంది. నాని కూతురిగా కియారా ఖన్నా నటిస్తుంది. చిత్రాన్ని డిసెంబర్ 7న రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నాని ఇండియా టుడే తెలంగాణ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని జాతీయ అవార్డ్స్ గురించి.. జై భీమ్ ట్వీట్ వివాదంపై స్పందించారు. జాతీయ అవార్డ్స్ గురించి నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా భావించారని, అలా నేనెప్పుడు అనలేదని అన్నారు. నేను నా ట్వీట్లో తెలుగు వారికి జాతీయ అవార్డ్లు రావడం పట్ల వారిని అభినందిస్తూ పోస్ట్ పెట్టా. అదే సమయంలో `జైభీమ్` సినిమాకి అవార్డు రానందుకు బాధపడుతూ ఆ పోస్ట్ పెట్టానని చెప్పారు. ఇక్కడ తెలుగు వారిని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదని, కానీ ఆ సినిమా కూడా అవార్డు వస్తే బాగుంటుందని, దానికి అంత వర్త్ ఉందని నా ఒపినీయన్ అని నాని తెలియజేశారు.నా భావనని కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారు అని నాని అన్నాడు.
ఉదాహరణకు మా చెల్లి ఒక ఘనత సాధించి పక్కింటి నా కజిన్ ఏమి సాధించలేకపోతే.. అప్పుడు నా చెల్లి కోసం సంతోషం వ్యక్తం చేసి, కజిన్ కోసం బాధపడతాం కదా. అలానే జైభీమ్ సినిమా పట్ల ట్వీట్ చేశాను. అయితే కొందరు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కిన అవార్డులతో సంతోషంగా లేరని.. అసంతృప్తిగా ఉన్నారని రాశారు. అసలు నేను ఎప్పుడు ఆ మాట చెప్పాను. కానీ జైభీమ్ సినిమాకు అవార్డ్ వచ్చి ఉంటే ఆ చిత్రనిర్మాతలు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉండేదనేది నా అభిప్రాయం అంటూ నాని క్లారిటీగా వివరణ ఇచ్చారు. నాని వివరణతో వివాదం సద్దుమణిగినట్టేనా లేదా అనేది చూడాలి.