జబర్ధస్త్ అనే కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన వేణు ఇటీవల బలగం అనే చిత్రంతో దర్శకుడిగా కూడా మారాడు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బలగం చిత్రానికి ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు అందించారు. అంతేకాకుండా ఈ మూవీకి పలు అవార్డ్స్ కూడా దక్కాయి. అయితే బలగం’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వేణు ఎలాంటి సినిమా చేయబోతున్నారనే గత కొద్ది రోజులుగా నడుస్తుంది. ఇటీవల తన రెండో సినిమా స్క్రిప్ట్ పనులను ప్రారంభించినట్టు వేణు చెప్పుకొచ్చారు. అయితే ఏ జానర్లో కథ సిద్ధం చేస్తున్నాడు. హీరోగా ఎవరికి ఎంపిక చేసుకున్నాడు వంటి వాటిపై మాత్రం క్లారిటీ లేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ దర్శకులకి అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహించే వారిలో నాని ముందు ఉంటారు. నాని ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమా చేయగా, శౌర్యువ్ అనే కొత్త దర్శకుడిని ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు నాని. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు నాని. తాజాగా నాని సోషల్ మీడియాలో తన అభిమానులతో కలిసి ముచ్చటించారు. ఈ క్రమంలో కొత్త దర్శకుల్లో మీరు ఎవరితో పనిచేయాలని కోరుకుంటున్నారు? అని నానీని అడగగా ‘బలగం’ దర్శకుడు వేణు అని సమాధానం ఇచ్చారు నాని. అయితే, నాని.. వేణు (బలగం) అని ట్వీట్ చేయగానే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.
మరి నాని, వేణు కాంబోలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అనే సినిమాలో నటిస్తున్నారు. నాని 31వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘అంటే సుందరానికి’ లాంటి హిలేరియస్ కామెడీ ఎమోషనల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మాస్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుండగా, ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య విలన్ గా నటిస్తున్నారు.