ఇండియన్ సినిమా చరిత్రలో శ్రీదేవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె తన నటనతో, అందంతో కోట్లాది ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది. కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేసి ఎంతగానో అలరించింది. అయితే అనుకోకుండా ఆమె 2018 ఫిబ్రవరి 24న కన్నుమూసింది. ఆమె మరణం ప్రతి ఒక్కరికి తీరని విషాదాన్ని మిగిల్చింది. వేడుకలో పాల్గొనేందుకు ఫ్యామిలీతో పాటు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు అనేది అధికారుల సమాచారం. అయితే అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఓ సందర్భంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆమె మరణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. శ్రీదేవి అతి కఠినమైన ఆహార నియమాలు పాటించేదని, అప్పుడప్పుడు స్పృహ కూడా కోల్పోయేదని తెలియజేశాడు.
ఆ క్రమంలోనే శ్రీదేవి బాత్ టబ్లో పడి ఊపిరి ఆడక చనిపోయిందని బోనీ కపూర్ అన్నాడు. అయితే తాజాగా శ్రీదేవి మరణానికి కొత్త కారణం వెలుగులోకి వచ్చింది. 1972లో జరిగిన సంఘటనని ఉదహరిస్తూ ఆమెకి జలగండం ఉండడం వల్లనే అలా చనిపోయిందని అంటున్నారు. వివరాలలోకి వెళితే బాల భారతం చిత్రంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించగా, ఈ మూవీలో కౌరవులు, పాండవులు పాత్రలను చైల్డ్ ఆర్టిస్ట్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ తమిళనాడు రాష్ట్రంలో గల హొగెనక్కల్ వాటర్స్ ఫాల్స్ వద్ద చేశారు. అయితే షూటింగ్ గ్యాప్లో చైల్డ్ ఆర్టిస్లు అందరు కలిసి వాటర్ ఫాల్స్ దగ్గర సందడి చేశారట. శ్రీదేవి ఒక రాడ్డును పట్టుకుని వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తుండగా, ఆమె పక్కన ధర్మరాజు, అర్జునుడు పాత్రలు చేస్తున్న ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారట.
అయితే అనుకోకుండా శ్రీదేవి చేయి జారీ నీళ్లలో పడిపోగా, వెంటనే పక్కన ఉన్న ఇద్దరు పిల్లలు ఆమె చేయి పట్టుకొని కాపాడారంట. ఈ విషయాన్ని ఆ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కమెడియన్ విశ్వేశ్వరరావు చెప్పారు. అయితే శ్రీదేవికి జలగండం ఉండగా, అప్పుడు ఎలాగోలా దాని నుండి తప్పించుకుంది. కాని దుబాయ్ హోటల్ లో మాత్రం ఆమె తప్పించుకోలేకపోయిందని కొందరు చెప్పుకొస్తున్న మాట. అయితే దీనిని కొందరు కొట్టి పడేస్తున్నారు. అదంతా ఉట్టి పుకారేనని ఇందులో నిజం లేదంటూ తెలియజేస్తున్నారు.