అధికారంలో ఉన్నప్పుడు వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. దశాబ్ద కాలం వారు చెప్పిందే వేదం... చేసింది న్యాయం అన్నట్టు సాగిపోయింది
– 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్
– కరీంనగర్ లో భూకబ్జాదారులపై పోలీసుల ఉక్కు పాదం
– పోలీసుల ముందు క్యూకడుతున్న బాధితులు
విధాత బ్యూరో, కరీంనగర్: అధికారంలో ఉన్నప్పుడు వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. దశాబ్ద కాలం వారు చెప్పిందే వేదం… చేసింది న్యాయం అన్నట్టు సాగిపోయింది. అధికారం ఇలా చేజారి పోయిందో లేదో, నాటి పాపాలకు వారు ఫలితం అనుభవిస్తున్నారు. ఒకరి వెనుక మరొకరు జైలు బాట పడుతున్నారు. గతంలో అధికార పార్టీ నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలను మౌనంగా భరించిన బాధితులు పోలీసుల ముందు క్యూ కడుతున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా అక్రమార్కులపై పోలీసులు కొరడా ఝళిపిస్తుండడంతో, గులాబీ నేతలకు పట్టపగలే ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపూర్ సర్పంచ్ గా, కార్పొరేటర్ గా భూ కబ్జాలకు పాల్పడిన జంగిలి సాగర్ ను కొత్తపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ 447,477,386,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
– బెదిరించి రూ.10 లక్షల వసూలు
సీతారాంపూర్ ప్రాంతానికి చెందిన లింగారెడ్డి అనే ఉపాధ్యాయుడికి తన పూర్వీకుల నుండి సంక్రమించిన భూమి ఉంది. ఇందులో కొంత మొత్తాన్ని తనకు అప్పనంగా ఇవ్వాలని సాగర్ బెదిరింపులకు గురిచేశారు. అయినప్పటికీ లింగారెడ్డి వినకపోవడంతో ఆయన భూమి మధ్య నుండి అక్రమంగా రోడ్డు వేయించారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో లింగారెడ్డి పది లక్షల రూపాయలను ఆయనకు సమర్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు, వీడియో ఫుటేజ్ ఆయన సీపీకి అందజేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు జంగిల్ సాగర్ కోసం వేట సాగిస్తుండగా, ఆయన పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. సరిగ్గా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్ లో అడుగుపెట్టిన రోజే పోలీసులు అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించడం విశేషం.
– రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు?
భగత్ నగర్ లో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఇంటి నిర్మాణం విషయంలో అడ్డంకులు సృష్టించిన కార్పొరేటర్ తోటరాములు, కేటీఆర్ సమీప బంధువు చీటీ రామారావులను స్థానిక వన్ టౌన్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. కరీంనగర్ పట్టణంలో విచ్చలవిడిగా భూకబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అనేకమంది గులాబీ పార్టీ నేతలపై పోలీసులకు ఫిర్యాదులు అందుతుండడంతో, ఆ ఫిర్యాదులన్నింటిపై విచారణను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో మరికొన్ని అరెస్టులు ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.