మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో గురువారం ఉదయం దారుణం జరిగింది. మేడ్చల్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ బంగారం దుకాణంలోకి ఇద్దరు ప్రవేశించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో గురువారం ఉదయం దారుణం జరిగింది. మేడ్చల్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ బంగారం దుకాణంలోకి ఇద్దరు ప్రవేశించారు. ఇద్దరు మగాళ్లే అయినప్పటికీ ఒకరు బుర్ఖా ధరించారు. మరొకరు హెల్మెట్ ధరించి ఉన్నాడు.
అయితే దుకాణంలోకి ప్రవేశించిన వెంటనే బుర్ఖా ధరించిన వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీశాడు. డబ్బు, బంగారం ఇవ్వాలంటూ దుకాణం యజమాని శేషరాంను బెదిరించాడు. అంతటితో ఆగకుండా అతని ఎడమ భుజం వద్ద కత్తితో దాడి చేశాడు. పక్కనే ఉన్న శేషరాం కుమారుడు భయపడి లోపలికి వెళ్లిపోయాడు. ఇక నగదు బ్యాగులో వేసుకునేందుకు దొంగలు ప్రయత్నిస్తున్న సమయంలో.. శేషరాం తెలివిగా షాపు నుంచి బయటకు పరుగెత్తుకు వచ్చి హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా అరిచాడు.
దొంగలు అప్రమత్తమై వారు బయటకు వచ్చారు. మరోసారి శేషరాంపై కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. శేషరాం కుమారుడు దుకాణంలో నుంచి ఓ కుర్చీని ఎత్తుకొచ్చి దొంగలపైకి విసిరాడు. కానీ అది బలంగా తగలకపోవడంతో.. దొంగలు కింద పడలేదు. అక్కడ్నుంచి దొంగలు తప్పించుకున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దొంగల దోపీడీపై శేషరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కొంపల్లిలోని బంగారం దుకాణంలో దొంగల బీభత్సం.. యజమానిపై కత్తితో దాడి.. pic.twitter.com/1IJmCjFhvT
— vidhaathanews (@vidhaathanews) June 20, 2024