Padmavathi Temple | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అలాగే, ఉత్సవాల్లో పాల్గొనేందుకు సైతం భక్తులకు అవకాశం కల్పిస్తున్నది.
Padmavathi Temple | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఉత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అలాగే, ఉత్సవాల్లో పాల్గొనేందుకు సైతం భక్తులకు అవకాశం కల్పిస్తున్నది. ఇక ఉత్సవాలకు 21న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొన్నవచ్చని పేర్కొంది. ఉత్సవాల్లో భాగంగా మే 23న ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కనులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. వార్షిక వసంతోత్సవాలు పురస్కరించుకొని మే 14న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఉత్సవాల కారణంగా మే 14న, మే 21 నుంచి 24 వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 23న తిరుప్పావడ సేవ, మే 24న లక్ష్మీపూజ పూజ ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.