Ayodhya Diwali 2025| అయోధ్యలో దీపోత్సవ శోభ..రెండు గిన్ని స్ రికార్డులు
రామజన్మభూమి అయోధ్య దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవంతో శోభాయమానంగా వెలిగిపోయింది. 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించి సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు. అలాగే 2,100 మందితో సరయూ నదీ తీరాన మహా హారతి నిర్వహించి మరో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.

న్యూఢిల్లీ : రామజన్మభూమి(Ram Janmabhoomi) అయోధ్య దీపావళి( Ayodhya Diwali 2025) సందర్భంగా నిర్వహించిన దీపోత్సవంతో శోభాయమానంగా వెలిగిపోయింది. 2017లో నిర్వహించిన తొలి దీపోత్సవంలో 1.71 లక్షల దీపాలను వెలిగించగా..ఈ దఫా 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించి సరికొత్త గిన్నిస్ రికార్డు(Guinness World Records) సృష్టించారు. అలాగే 2,100 మందితో సరయూ నదీ తీరాన మహా హారతి(Sarayu Aarti record) నిర్వహించి మరో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో వైభవంగా ఈ కార్యక్రమాల నిర్వహించారు. సీఎం యోగి ఆధిత్యనాధ్(Yogi Adityanath) ఆయా కార్యక్రమాలను ప్రారంభించి పర్యవేక్షించారు.
ఆకట్టుకున్న రామాయణ ప్రదర్శనలు
ఉత్సవాల సందర్భంగా 1,100 డ్రోన్లతో(Drone light show) రామాయణ ఘట్టాలను కళ్లకు అద్బుతంగా కళ్లకు కట్టారు. 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, గ్రాఫిక్ లేజర్ షోలు, బాణసంచా వేడుకలు ఆకట్టుకున్నాయి. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు ఏడు కాండాల ప్రదర్శనకు ప్రత్యేక శకటాలు ఏర్పాటుతో ప్రదర్శన నిర్వహించారు. 100 మంది చిన్నారులతో వానర సేన ఊరేగింపు నిర్వహించారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృందం సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలలో ఆకట్టుకున్నారు. మణిపుర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా, జానపద నృత్యాలను ప్రదర్శించారు. నగర వీధులు, ఆలయ మార్గాలు, ప్రధాన కూడళ్లను రకరకాల విద్యుద్దీపాలతో అలంకరించారు. ‘మేరా దీప్.. మేరా విశ్వాస్’ పేరిట నిర్వహించిన పెయింటింగ్, కవిత్వం, యానిమేషన్ పోటీల విజేతలను ఉత్సవాలకు ఆహ్వానించి బహుమతి ప్రధానోత్సం చేశారు. దీపోత్సవంలో భాగంగా ‘మిషన్ శక్తి’, ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించారు. స్వయం సహాయక బృందాల స్టాల్స్ ఏర్పాటు చేశారు.