Hanuman Jayanti | హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు 108 వడలతో చేసిన మాలను అలంకరిస్తుంటారు. మినప్పప్పు, మరియాలతో తయారు చేసిన వడలను స్వామివారికి అలంకరించే విషయం తెలిసిందే. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వడమాలను స్వామివారికి భక్తులు సమర్పిస్తుంటారు. అయితే, దీని వెనుక ఓ విశిష్టత ఉన్నది. హనుమ బాల్యంలో మహా చిలిపివాడన్న విషయం అందరికీ తెలిసిందే.
Hanuman Jayanti | హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు 108 వడలతో చేసిన మాలను అలంకరిస్తుంటారు. మినప్పప్పు, మరియాలతో తయారు చేసిన వడలను స్వామివారికి అలంకరించే విషయం తెలిసిందే. ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వడమాలను స్వామివారికి భక్తులు సమర్పిస్తుంటారు. అయితే, దీని వెనుక ఓ విశిష్టత ఉన్నది. హనుమ బాల్యంలో మహా చిలిపివాడన్న విషయం అందరికీ తెలిసిందే. బాల ఆంజనేయుడు సూర్యుడిగా పండుగా భావించి మింగిన గాథ, బాల్యంలో ఆయన చేసిన అల్లరి ప్రముఖంగా వినిపిస్తుంది.
ప్రచారంలో ఉన్న గాథ ప్రకారం.. సూర్యుడిని ఎర్రటి పండుగా భావించిన హనుమ దాన్ని తినేందుకు ఆకాశంలోకి ఎగురుతూ వెళ్తుంటాడు. అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమీపించడంతో రాహువు సైతం సూర్యుడి మింగేందుకు బయలుదేరుతాడు. తనకు దారిలో అడ్డువచ్చిన రాహువుని ఒక్క తన్ను తన్ని మరీ హనుమంతుడు సూర్యుడి మింగబోతాడు. ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడి మీదకు ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధంతో ఆంజనేయుడి దవడ (హను) గాయమవుతుంది. అప్పటి నుంచి ఆంజనేయుడికి హనుమంతుడు అన్న పేరు స్థిరపడింది. ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు జరిగిన దానికి ఆగ్రహంతో లోకాలన్నింటి నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు.
దాంతో దేవతలంతా దిగివచ్చి ఆయనను శాంతింపచేసి, ఆంజనేయుడికి సకల వరాలూ ప్రసాదిస్తారు. ఈ కథ దాదాపు అందరికీ తెలిసిందే. కానీ, మరో కథ సైతం ప్రచారంలో ఉన్నది. ఈ సందర్భంలో ఆంజనేయుడి పరాక్రమానికి రాహువు సైతం ముగ్ధుడైపోయాడని.. రాహువుకి మినుములు అంటే ప్రీతి. అందుకే రాహుదోషాలు ఉన్నవారు మినుములని దానం చేయాలని సూచిస్తుంటారు. కాబట్టి ఇకమీదట హనుమంతుడికి ఎవరైతే మినుములతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారో.. వారిని తాను కూడా అనుగ్రహిస్తానని రాహువు తెలిపాడని పురాణగాథ. రాహువు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి.. వడలతో చేసిన మాల కూడా సర్పాకారంలోనే ఉండేట్లుగా స్వామివారికి అలంకరిస్తుంటారు. హైందవ ధర్మంలో 108 సంఖ్యకి ప్రాధాన్యం ఉన్నది. ఈ క్రమంలో వీలైనంత వరకూ 108 వడలతో మాలను తయారు చేసి సమర్పిస్తుంటారు.
అలాగే, వడమాలకు వెనుక మరో కథ సైతం ప్రచారంలో ఉంది. ఆంజనేయుడు పుట్టింది శనివారమేనని పురాణాలు చెబుతున్నాయి. ఆ శనివారానికి అధిపతి శనీశ్వరుడు. కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతుడికి ప్రసాదంగా అందిస్తే.. అటు ఆంజనేయుడు.. ఇటు శనీశ్వరుడూ ఇద్దరూ అనుగ్రహిస్తారు. నల్లటి పదార్థం ఏదైనా శనీశ్వరునికి ప్రీతికరమే. కాబట్టి మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. వడమాలకి ఓ లౌకికమైన కారణం సైతం కనిపిస్తుంది. ఔషధపరంగా మినుములకి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. మినుములతో చేసిన పదార్థాలను తీసుకుంటే బలాన్ని ఇస్తాయి. బలానికి మారుపేరైనా హనుమంతుడి పేరు చెప్పి ఆ మినపవడలని నలుగురికీ పంచితే అందరికీ ఆరోగ్యం లభిస్తుంది కదా..!