Badgai Maa Temple | సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా పూలు, కొబ్బరికాయలను తీసుకెళ్తారు. పూజ కోసం రకరకాల నైవేద్యాలను సమర్పిస్తుంటారు. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో వెలసిన బాగ్దాయ్ వన దేవత ఆలయంలోని సంప్రదాయం మాత్రం వీటికి భిన్నంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ అమ్మవారికి పూలు, పండ్లు కాకుండా రాళ్లు, కంకరను నైవేద్యంగా సమర్పిస్తారు.
బిలాస్పూర్ జిల్లాలోని సర్కండా ప్రాంతంలోని అశోక్నగర్లో ఈ ఆలయం ఉంది. ఈ గుడిలోని బాగ్దాయ్ అమ్మవారిని ప్రజలు వనదేవతగా కొలుస్తారు. వన దేవతను దర్శించుకోవడానికి స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళ్తుంటారు. ప్రత్యేకంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది.
రాళ్లతోనే మొక్కులు
ఈ ఆలయం ఇప్పుడు అందర్నీ ఆకర్షించడానికి కారణం ఇక్కడ మొక్కులు తీరిన తర్వాత భక్తులు కొబ్బరి కాయలు కొట్టారు. నైవేద్యం పంచరు. కేవలం ఐదు గోటాలు (రాళ్లు) మాత్రమే సమర్పిస్తారు. దాదాపు వంద సంవత్సరాలుగా ఈ అచారం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. మనస్ఫూర్తిగా ఐదు రాళ్లు, ఒక పువ్వు సమరిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. కాగా, ఈ ఆలయంలో అఖండ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.
ఆలయం వెనుక పురాణ గాథ
జానపద కథల ప్రకారం.. ఈ ఆలయంలో రాళ్లను సమర్పించడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సుమారు వంద ఏళ్ల క్రితం ఈ గుడి ఉన్న ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. పక్కన గ్రామాల వాళ్లు గొర్రెలు, పశువులను మేపుకునేందుకు ఈ అడవికి వచ్చేవారు. అలాగే గొర్రెలను మేపుకోవడానికి వచ్చిన ఓ కాపరి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అమ్మవారు అతని కలలో ప్రత్యక్షమయ్యింది. తాను అక్కడే ఉన్నానని చెప్పింది. కలలో చెప్పినట్లుగా వెతక్కగా కాపరికి ఓ సజీవ విగ్రహం కనిపించింది. దాన్ని అక్కడే ప్రతిష్టించాడు. అయితే అప్పుడు పూజకు ఏమీ లేకపోవడంతో దగ్గరలో ఉన్న ఐదు రాళ్లను సమర్పించాడు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. కాగా, అమ్మవారి మాట ప్రకారం ఆ గొర్రెల కాపరి అక్కడ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు.
1990ల్లో ఈ ఆలయాన్ని విస్తరించారు. సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. 2018లో ఇక్కడ ద్వాదశ లింగాలను ప్రతిష్టించారు. అనంతరం 2021లో సీతారాములు, రాధాకృష్ణుల ఆలయ నిర్మాణాలను కూడా చేపట్టారు. ఇప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో వనదేవితోపాటు మంసా మాత, మహామాయ, సంతోషిమాత, కాళీదేవి, అన్నపూర్ణ, శీతల, దుర్గామాత, శారదామాత విగ్రహాలు ఉన్నాయి. దక్షిణముఖి, పంచముఖి హనుమాన్ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్టించారు.
ఈ ఆలయ ప్రాచుర్యం ఇప్పుడు రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతి ఏటా చైత్ర శరదృతు నవరాత్రుల సందర్భంగా బాగ్దాయ్ వనదేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ఈ సమయంలో అడవి మధ్యలో జరిగే జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత కలగలసిన అద్భుత అనుభూతిని అందిస్తుంది.
Read More:
ఆ గుడిలో నూడిల్స్, పిజ్జాలే ప్రసాదం.. సూప్లే తీర్థం.. భారత్లోని ఈ ఆలయ చరిత్ర తెలుసా!
తెలంగాణలో ఇక టెంపుల్ టూరిజం వైభవం.. బాసర నుంచి భద్రాచలం దాకా…
