Peddi | టాలీవుడ్లో మరోసారి నిర్మాతల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. చాలా కాలంగా చర్చకు వస్తున్న రెంటల్ విధానం, పర్సెంటేజీ విధానం అంశం ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా భారీ సినిమాల విడుదల సమయంలో ఈ వివాదం ఎక్కువగా తెరపైకి వస్తుండగా, ఇప్పుడు పెద్ది రిలీజ్ సమయానికే ఈ అంశం మళ్లీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో రెంటల్ విధానం అమలులో ఉంది. అయితే కొంతమంది నిర్మాతలు, ఎగ్జిబిటర్లు దీనిని పర్సెంటేజీ విధానంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొందరు నిర్మాతలు మాత్రం ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రత్యేక సమావేశంలో..
ఇటీవల ఎగ్జిబిటర్లతో కలిసి నిర్మాతలు శిరీష్, సునీల్ నారంగ్ మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్సెంటేజీ విధానానికి అంగీకరించే నిర్మాతల సినిమాలకే థియేటర్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి.
అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాగవంశీ, రవి శంకర్, సాహూ గారపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిరీష్ వ్యాఖ్యలపై నాగవంశీ తీవ్రస్థాయిలో స్పందించారు.
పెద్దిపై హైప్ ఎక్కువ..
నాగవంశీ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో వస్తున్న సినిమా ‘పెద్ది’ అని అన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడిందని, ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావడానికి ఈ సినిమా కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. వచ్చే ఆరు నెలల్లో వరుసగా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని, ‘పెద్ది’తో ప్రారంభమయ్యే ఈ మొమెంటం ఇండస్ట్రీకి ఎంతో ముఖ్యమని చెప్పారు.
ఇలాంటి సమయంలో కావాలనే ‘పెద్ది’ సినిమాపై న్యూసెన్స్ సృష్టించేలా కొందరు వ్యవహరిస్తున్నారని నాగవంశీ ఆరోపించారు. ఇండస్ట్రీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత అజెండాలతో కొందరు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లపై ప్రేమ చూపిస్తున్నట్లు మాట్లాడేవారు నిజంగా వాటి అభివృద్ధి కోసం పనిచేస్తే బాగుంటుందని నాగవంశీ వ్యాఖ్యానించారు. “మల్టీప్లెక్స్ల ద్వారా లాభాలు పొందుతూ.. సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడటం సరైంది కాదు. నిజంగా అంత ప్రేమ ఉంటే వాటిని ఆధునీకరించాలి” అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు.
విమర్శలు..
ఇక మైత్రి రవిశంకర్ కూడా పర్సెంటేజీ విధానం కోరుతున్న వర్గాలపై విమర్శలు గుప్పించారు. ఎక్కువ మల్టీప్లెక్స్లు ఉన్నవారే ఈ విధానాన్ని బలవంతంగా తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు.
మొత్తంగా చూస్తే ‘పెద్ది’ విడుదలకు ముందు టాలీవుడ్లో మరోసారి థియేటర్ వ్యవస్థపై ఉన్న విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయి. ఈ వివాదం రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
