Savitrii | తెలుగు సినీ చరిత్రలో అజరామరమైన స్థానం సంపాదించిన సావిత్రి నటనకు ప్రతిరూపం. సహజమైన అభినయంతో కోట్లాది ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఆమె, తెలుగు మాత్రమే కాదు తమిళ సినీ పరిశ్రమలో కూడా అగ్రనటిగా ఎదిగారు. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అనేక మలుపులతో నిండింది. ముఖ్యంగా జెమినీ గణేషన్తో ఆమె ప్రేమ, వివాహం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.
సావిత్రి మద్రాస్ చేరుకున్న ప్రారంభ రోజుల్లోనే జెమినీ గణేషన్ను కలుసుకున్నారు. అప్పట్లో ఆయన జెమినీ స్టూడియోలో కాస్టింగ్ మేనేజర్గా పని చేస్తూ, సావిత్రి ప్రతిభను గుర్తించారు. ఆమె ఫోటోలు తీసి నిర్మాతలకు పంపించడం ద్వారా సినిమా అవకాశాలు రావడానికి దోహదపడ్డారు. మొదటగా ‘సంసారం’ సినిమాలో అవకాశం వచ్చినా, హీరోయిన్ పాత్రకు చిన్నవయసు కారణంగా తొలగించబడింది. తర్వాత చిన్న పాత్రలతో ప్రారంభించిన ఆమెకు దేవదాసు చిత్రం పెద్ద బ్రేక్ ఇచ్చి స్టార్డమ్కు తీసుకెళ్లింది.
అనంతరం ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్ వంటి అగ్రహీరోలతో కలిసి నటిస్తూ అగ్రనటిగా వెలుగొందిన సావిత్రి, ‘మనంపోల మాంగల్యం’ సినిమా సమయంలో జెమినీ గణేషన్తో మరింత దగ్గరయ్యారు. ఆ సినిమాలో ముందుగా హీరోయిన్గా ఎంపికైన షావుకారు జానకి డేట్స్ సమస్యల కారణంగా ఆ అవకాశం సావిత్రికి దక్కింది. ఈ సినిమా సమయంలోనే వారి మధ్య అనుబంధం పెరిగి, చివరకు వివాహం వరకు వెళ్లింది. అయితే ఈ పెళ్లి విషయాన్ని కొన్ని సంవత్సరాల పాటు గోప్యంగా ఉంచినట్లు తరువాత వెల్లడైంది.
ఇక ఈ సంబంధం సావిత్రి జీవితంలో మరో కోణాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. జెమినీ గణేషన్కు అప్పటికే వివాహం కావడం, వ్యక్తిగత సమస్యలు సావిత్రిని మానసికంగా దెబ్బతీశాయి. దీంతో ఆమె మద్యానికి అలవాటు పడి అనారోగ్యం బారిన పడింది. చివరకు కోమాలోకి వెళ్లి అత్యంత విషాదకర పరిస్థితుల్లో మరణించింది. ఒక అద్భుతమైన నటి జీవితంలో ప్రేమ, నిర్ణయాలు ఎంత ప్రభావం చూపుతాయో సావిత్రి జీవితం ఒక ఉదాహరణగా నిలిచింది.
