Smriti Mandhana | స్మృతి వివాహం కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఆమె ఇంట విషాదకర పరిణామం చోటు చేసుకుంది. భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది. సాంగ్లీలోని సమ్డోల్ ప్రాంతంలోని మంధాన కుటుంబ ఫామ్హౌస్లో ఆదివారం స్మృతి మంధాన–సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. అయితే అనుకోని ఈ ఆరోగ్య సమస్య కారణంగా వివాహం నిరవధికంగా వాయిదా పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం అల్పాహారం సమయంలో శ్రీనివాస్ మంధాన ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించింది.
మొదట ఇది పెద్ద సమస్య కాదనుకున్నప్పటికీ, పరిస్థితి వేగంగా దిగజారడంతో వెంటనే అంబులెన్స్కు కాల్ చేసి ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, కానీ ఇంకా కొద్ది రోజులు వైద్య పర్యవేక్షణలో ఉండాలనే సూచన ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, “శ్రీనివాస్ గారి పరిస్థితి క్షణాల్లో మారిపోవడంతో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. స్మృతి తండ్రితో ఎంతో దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయన పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది” అని చెప్పారు.
స్మృతి మంధాన తండ్రి పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ దంపతుల హల్దీ, మెహందీ, సంగీత్ వంటి వేడుకలు ఎంతో అట్టహాసంగా జరగడం మనం చూశాం. స్మృతి కూడా ఎంతో ఉత్సాహంగా చిందులేసింది. ఈ రోజు తన ప్రియుడితో ఏడడుగులు వేస్తుందని అందరు ఎదురు చూస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆమె అభిమానులని ఎంతగానో బాధిస్తుంది. స్మృతి తండ్రి త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్ధిస్తున్నారు. ఇక స్మృతి తన వివాహానికి సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులని ఆహ్వానించిన విషయం తెలిసిందే.
