Virosh | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి వేడుక ఆత్మీయ వాతావరణంలో జరిగింది. అనంతరం బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రిసెప్షన్ అంటే సాధారణంగా మోడ్రన్ అవుట్ఫిట్స్లో కనిపిస్తారని భావించిన అభిమానులకు విరోష్ జంట సర్ప్రైజ్ ఇచ్చింది. పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో వేదికపై దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. విజయ్ పంచె కట్టుకొని భుజంపై కండువా వేసుకుని సరికొత్త లుక్లో మెరిసాడు. రష్మిక ఎరుపు రంగు చీరలో సొగసుగా కనిపించింది. ఇద్దరూ చేతిలో చెయ్యి వేసుకుని వేదికపైకి ఎంట్రీ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందుగా అతిథులను ఆప్యాయంగా పలకరించి, ఆ తర్వాత వేడుకలో పాల్గొన్నారు. “ఇదే సెలబ్రేషన్స్కు చివరి రోజు… ఇక కొంతకాలం అండర్గ్రౌండ్కి వెళ్తున్నాం” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ – ఉపాసన కామినేని దంపతులు కూడా విచ్చేశారు. అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున – అమల అక్కినేని దంపతులతో పాటు నాగ చైతన్య హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, వారి కుమార్తె సితార ఘట్టమనేని కూడా వేడుకలో పాల్గొన్నారు. అలాగే అల్లు అర్జున్, నవీన్ పోలిశెట్టి, నిర్మాత నాగవంశీ, తమిళ హీరో కార్తీ, నాని దంపతులు, దర్శకుడు సుకుమార్ కుటుంబ సభ్యులు, నిర్మాత దిల్ రాజు కుటుంబం, రాధిక శరత్కుమార్ – శరత్కుమార్ దంపతులు తదితరులు రిసెప్షన్లో సందడి చేశారు.
రాజకీయ రంగం నుంచి రేవంత్ రెడ్డి సతీమణి గీత హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని విజయ్–రష్మిక జంటను ఆశీర్వదించారు. మొత్తానికి విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా సాగింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన కొత్త జంట అందరి మనసులు గెలుచుకుంది.
