హైదరాబాద్‌ వచ్చే ఫ్లయిట్‌కు మానవ బాంబు బెదిరింపు!

జెడ్డా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో ఫ్లయిట్‌లో మానవ బాంబులు ఉన్నారని వచ్చిన మెయిల్‌ కలకలం రేపింది. దీంతో విమానాన్ని ముంబైకి తరలించి.. తనిఖీలు నిర్వహించారు.

  • By: TAAZ |    hyderabad |    Published on : Nov 01, 2025 6:35 PM IST
హైదరాబాద్‌ వచ్చే ఫ్లయిట్‌కు మానవ బాంబు బెదిరింపు!

జెడ్డా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానానికి మానవ బాంబు బెదిరింపు ఈమెయిల్‌ సంచలనం రేపింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే స్పందించి, విమానాన్ని ముందు జాగ్రత్త చర్యగా ముంబైకి తరలించారు. తమకు బెదిరింపు మెయిల్‌ వచ్చిన విషయాన్ని పోలీసులకు శనివారం ఉదయం విమానాశ్రయ అధికారులు ఫిర్యాదు చేశారు. జెడ్డా నుంచి వస్తున్న విమానాన్ని హైదరాబాద్‌లో ల్యాండ్‌ చేయించవద్దని, అందులో వస్తున్న ఎల్‌టీటీఈ–ఐఎస్‌ఐ వ్యక్తులు 1984నాటి మద్రాస్‌ ఎయిర్‌పోర్ట్‌ తరహాలో భారీ పేలుడుకు ప్లాన్‌ చేశారని ఆ మెయిల్‌లో పేర్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేసి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

అయితే.. మెయిల్‌లో బెదిరించినట్టుగా ఎలా అనవాళ్లు లభించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల సందర్భంగా తాము పూర్తి ప్రొటోకాల్‌ పాటించామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. తనిఖీలకు పూర్తిగా సహకరించామని, ఆ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నామని తెలిపింది. వారికి అవసరమైన రిఫ్రెష్‌మెంట్స్‌ అందించడంతో పాటు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేశామని పేర్కొంది.