India Aviation Duopoly : ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా

ఇప్పుడు ఎక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసినా వారి మధ్య తప్పనిసరిగా వస్తున్న అంశం.. ఇండిగో సంక్షోభం. అసలు ఈ సంక్షోభానికి కారణమేంటి? ఒక రంగాన్ని ఇద్దరు వ్యక్తులో లేదా రెండు సంస్థలో ఆక్రమించేస్తున్న వాతావరణం కనిపిస్తున్నది. అలా ఒక రంగాన్ని రెండేసి సంస్థలు ఆక్రమించేస్తున్న వైనంపైనే ఈ కథనం.

India Aviation Duopoly : ఏ రంగంలో అయినా ఇద్దరే పోటీనా

India Aviation Duopoly : ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం భారతదేశ విమానయాన రంగం పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చిందనే చెప్పాలి. గత ఐదారు రోజులుగా విమానాల రద్ధుతో ప్రయాణికుల కష్టాలు మాటల్లో చెప్పలేనివే. కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా అంతర్జాతీయ కుట్ర అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండిగో సంక్షోభంతో కార్పొరేట్ నియంత్రణ ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమవుతోందని అంటున్నారు. ఏ రంగాన్నైనా ఇద్దరు లేదా రెండు సంస్థలు ఆక్రమించేస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతున్నది. దీనికి అడ్డు కట్ట వేయకపోతే.. ఇదే పద్ధతి మిగిలిన రంగాలకూ పాకే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ తీసుకువచ్చిన ఎఫ్‌డీటీఎల్‌ విధానం.. ఇండిగో సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ విమానయాన రంగంలో 65 శాతం వాటా కలిగిన ఇండిగోపై తాజా సంక్షోభం విపరీతమైన ప్రభావం చూపింది. అయితే ఈ ఎఫ్‌డీటీఎల్‌ విధానాన్ని ప్రారంభించే ముందు ఏ విధమైన సవాళ్లు ఎదురవుతాయనేది కేంద్రం అంచనా వేయలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇండిగో ఎయిర్ లైన్స్‌ను ఇబ్బందులకు గురి చేసేందుకు, గుత్తాధిపత్యాన్ని ప్రోత్సహించేందుకు ఎఫ్.డీ.టీ.ఎల్ విధానాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇండిగో తన విమాన సర్వీసులను రద్ధు చేస్తే తట్టుకునే విధంగా మిగతా ఎయిర్ లైన్స్ లేవు.

ప్రస్తుతం దేశంలో ‘ఇండిగో’తో పాటు టాటా గ్రూపు ఎయిర్ లైన్స్ 90 శాతం వాటా కలిగి ఉండగా, మిగతా కంపెనీలకు పది శాతం వాటా ఉంది. టెలికం, పోర్టులు, ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ రంగాలలో ఇప్పటికే రెండు సంస్థల మధ్య వ్యాపారం విస్తరించి, బలంగా నాటుకు పోయి ఉంది. అదే తరహాలో విమానయాన రంగాన్ని సిద్ధం చేస్తున్నారనే విమర్శలు మార్కెట్‌లో బలంగా విన్పిస్తున్నాయి.

ఫుడ్ డెలివరీ రంగంలో ప్రస్తుతం స్విగ్గీ, జొమాటో ప్రధానంగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ వాటా 42 శాతం, జొమాటో వాటా 58 శాతం వరకు ఉన్నట్లు అంచనా. ఈ రెండు సంస్థలే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ మార్కెట్‌ను ఏలుతున్నాయి. వీటి పొటీని కొత్తగా వచ్చే అంకురాలు, సంస్థలు తట్టుకుని నిలబడలేక చతికిల పడుతున్నాయి.

ఇక క్యాబ్ రంగాన్ని తీసుకుంటే ఓలా, ఉబెర్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వీరి మధ్య పోటీలో రాపిడో ఆ స్థాయిలో ముందుకు రాలేకపోతున్నది. ఇన్ డ్రైవ్ కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, మార్కెట్ వాటా చూస్తే చాలా స్వల్పంగా ఉంది. ఓలా, ఉబెర్‌ సంస్థల వాటా క్యాబ్ మార్కెట్‌లో 80 శాతానికి పైగా ఉంది.

ఆన్‌లైన్‌ అంగడి వ్యాపారం చేస్తున్న ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ .. దేశంలో వినియోగదారులను శాసిస్తున్నాయి. డిస్కౌంట్ రేట్లు, పలు ఆఫర్లను ప్రకటించి రిటైల్ మార్కెట్ చైన్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ కామర్స్‌లో ఈ రెండు సంస్థల వాటా 80 శాతం. టైర్‌ టూ, టైర్ త్రీ నగరాల్లో దిగువ మధ్య తరగతి ప్రజలు ‘మీషో’లో ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పీ.సీ.ఐ) లెక్కల ప్రకారం దేశంలో డిజిటల్, యూపీఐ చెల్లింపులలో కూడా ఫోన్ పే, గూగుల్ పే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ రెండింటి పోటీని మిగతా సంస్థలు తట్టుకోలేక, ముందుకు పోలేక పోతున్నాయి.

ఇక టెలికాం రంగాన్ని తీసుకుంటే జియో, ఎయిర్ టెల్ మధ్య విపరీతమైన పోటీ ఉంది. ఈ రెండు సంస్థల పోటీ మధ్య మిగతా సంస్థలు నిలదొక్కుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఐడియా, వోడాఫోన్.. విలీనం అయినా పోటీలో కనిపించడం లేదు. అప్పుల భారంతో పాటు, 4జీ నెట్ వర్క్ తో ఇంకా వీఐ కంపెనీ నిలదొక్కుకోవడానికే నానా తంటాలు పడుతున్నది. ట్రాయ్ వివరాల ప్రకారం మెజారిటీ వినియోగదారులను జియో, ఎయిర్ టెల్ కలిగి ఉన్నాయి.
విమానయాన రంగాన్ని ఒకసారి గమనిస్తే ఇండిగో ఎయిర్ లైన్స్ వాటా 65 శాతం కాగా, టాటా గ్రూప్ ఎయిర్ లైన్స్ వాటా 27 శాతం వరకు ఉందిగా. ఈ రెండు సంస్థలు విస్తరణ బాటలో ఉండటంతో మిగతా సంస్థలు ఈ రంగంలోకి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదనే వాదన కూడా ఉంది. ఇవే కాకుండా కార్గో, పోర్టులు వంటి రంగాలలో రెండు సంస్థలే పోటీ పడుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

భారీ ఎత్తున నిధులు సమకూర్చుకుని ఏదైనా ఒక రంగంలో భారీ సంస్థ అడుగు పెడితే అప్పటికే ఆ రంగంలో ఉన్న చిన్నాచితక సంస్థల మనుగడ దెబ్బతింటుంది. భారీ కంపెనీలు.. ప్రపంచ స్థాయి పెట్టుబడులు రాబట్టుకోవచ్చు. ప్రతి ఒక్క వినియోగదారుడినీ ఆకర్షించవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలు పటిష్టంగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. చిన్న సంస్థలను క్రమంగా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొనుగోలు చేయడం లేదా విలీనం చేసుకోవడం వంటి పద్ధతులను పెద్ద కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఈ కారణాలతో దేశంలో అన్ని రంగాల్లో పెద్ద సంస్థలు ముందంజలో ఉంటూ, మిగతా సంస్థలను మనుగడ లేకుండా చేస్తున్నాయి.

ఏ రంగంలో అయినా ఇద్దరి మధ్య పోటీతో అంతిమంగా వినియోగదారులకు నష్టం అధికంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. క్యాబ్ రంగంలో తీసుకుంటే ఓలా, ఉబెర్‌.. డిమాండ్, పరిస్థితులను బట్టి అత్యధిక చార్జీలు విధిస్తున్న పరిస్థితి ఉన్నది.

ఫుడ్ డెలివరీ యాప్స్‌లో కూడా ఇదే విధానం అమలవుతున్నది. మొబైల్ సిమ్ కోసం వెళ్తే ఒకటి రెండు కంపెనీలను చూసి ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు. డిజిటల్ అడ్వర్టయిజ్ కారణంగా దేశంలో సంప్రదాయకంగా వస్తున్న అడ్వర్టయిజ్ మెంట్ పై ఆధారపడిన లక్షలాది మంది రోడ్డు మీద పడ్డారు. చిన్న వ్యాపారులు ఆ స్థాయిలో ఖర్చు పెట్టలేకపోతున్నారు. నిత్యావసర రంగంలో ప్రతి ఒక్కరు యాప్ మీద ఆధారపడే పరిస్థితిని రెండు మూడు సంస్థలు కల్పించడంలో స‌ఫ‌లీకృతం అయ్యాయని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రతి రంగంలో కనీసం నలుగురు లేదా నాలుగైదు సంస్థల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దీర్ఘకాలికంగా ఆ ప్రభావం ప్రజలతో పాటు ప్రభుత్వాలపై కూడా ఉంటుందంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Jolla Smartphone : ప్రైవసీ కావాలా ఈ మొబైల్ బెస్ట్
Mario Trailer : నవ్విస్తున్న ‘మారియో’ ట్రైలర్