విధాత, హైదరాబాద్ : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రజాప్రయోజనం పిటీషన్ దాఖలైంది. మొయినాబాద్ మండలం పెద్దమంగళూరుకు చెందిన మందడి మాధవరెడ్డి ఈ పిటీషన్ దాఖలు చేయగా..మరో పిటీషనర్ ఇంప్లీడ్ అయ్యారు. జంట జలాశయాల పరివాహకాలు ఎకో జోన్ ల పరిధిలో ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన జీవో నెంబర్ 111 ఉల్లంఘిస్తు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని పిటీషన్ లో ఆరోపించారు. మహానగరానికి జంట జలాశయాలు ఎంతో ముఖ్యమైనవని పిటిషనర్ల న్యాయవాదులు పేర్కొన్నారు.
ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, న్యాయమూర్తి రేణుక యారాతో కూడిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి, సంబంధిత శాఖలకు, ప్రైవేటు వ్యక్తులకు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.
