సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయంలో సోమవారం మాతంగి స్వర్ణలత రంగం కార్యక్రమంలో అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. పచ్చికుండపై నిల్చొని మాతంగి రంగం భవిష్యవాణిని చెప్పారు. భవిష్యవాణిలో ప్రజలకు, పాలకులకు మాతంగి తీవ్ర హెచ్చరికలు చేశారు. నేను సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చాను అంటూ కంటతడి పెట్టారు. చాలా ఇబ్బంది పెడుతున్నారని.. తృప్తి లేకుండా చేశారని, దోషడంత ఇస్తే గోరంత కూడా పెట్టడం లేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మీరెవరు నేను చెప్పింది ఏది ఆచరించడం లేదు అని, అలాంప్పుడు నేను మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నేను కోరింది మీరు చేస్తున్నారా? మీ ఆపదల్లో నేను అండగా నిలిచాను. మీకు వచ్చిన కష్టాలను తొలగించాను. నా పిల్లలను ఎప్పుడూ కాపాడుతున్నాను. ఏ ప్రమాదం వచ్చినా వారికి రక్షణగా ఉంటాను. కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారుగాని.. ఇప్పటివరకు విగ్రహ ప్రతిష్ట చేయడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆపద వచ్చినా ప్రమాదం వచ్చినా, కాపాడుతున్నానని..కాని మీరు చేసే చర్యల వల్ల నాకు ఆగ్రహం తెప్పిస్తున్నారని చెప్పారు. ఆరుమాసాల్లో నా విగ్రహ ప్రతిష్ట జరపకపోతే భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని, నాకు ఎవరు అడ్డొచ్చినా వారిని పాదాల కింద నలిపేస్తానని హెచ్చరించారు.
అలాగే ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు ఉన్నాయి అని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని, వర్షాలు, వరదలతో ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, ఈ ఏడాది ప్రాణ నష్టం భారీగా జరుగుతుందని హెచ్చరించారు. వావి వరుసలు లేకుండా ప్రజల వ్యవహరిస్తున్నారు అని, పిల్లలను తల్లిదండ్రులు ఊరిమీద వదిలేశారు అని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు సంతోషం లేకుండా ప్రజలు చేస్తున్నారని, ప్రజలకు అహంకారం ఎక్కువైందని, తగ్గించుకోవాలని హెచ్చరించారు.
రంగం అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
