Bangladesh Bus Accident | బంగ్లాదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం..23మంది గల్లంతు

బంగ్లాదేశ్‌లోని దౌలత్‌దియా ఘాట్ వద్ద పద్మా నదిలోకి ప్రయాణికుల బస్సు దూసుకెళ్లిన ఘోర ప్రమాదంలో 23మంది గల్లంతయ్యారు.

Bangladesh Bus Accident

విధాత, హైదరాబాద్ : బంగ్లాదేశ్‌లోని దౌలత్‌దియా ఘాట్ వద్ద పద్మా నదిలోకి ప్రయాణికుల బస్సు దూసుకెళ్లిన ఘోర ప్రమాదంలో 23మంది గల్లంతయ్యారు. ప్రమాదానికి గురైన బస్సులో పలువురు పిల్లలు, మహిళలతో సహా 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఇప్పటిదాక 18మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన బస్సు నుండి ప్రయాణికులను వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రతికూల వాతావరణంలో దాదాపు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత, క్రేన్ సహాయంతో బస్సును నది నుండి బయటకు తీశారు.

అందరూ చూస్తుండగానే నదిలో పడిపోయిన బస్సు

ఈద్ పండుగ జరుపుకుని ఢాకాకు ప్రయాణికులతో తిరిగి వస్తున్న బస్సు డౌలత్ దియా ఫెర్రీ ఘాట్ వద్ద నదిలోకి దూసుకపోయింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బస్సు ఫెర్రీని సమీపిస్తుండగా, ఒక చిన్న యుటిలిటీ ఫెర్రీ పాంటూన్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా నదిలోకి దూసుకుపోయింది. కొంతమంది ఈదుకుంటూ బయటపడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా, చాలామంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. అందరూ చూస్తుండగానే బస్సు నదిలో పడిపోవడంతో అక్కడే ఉన్న ప్రజలు కొంతమందిని కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను కొనసాగించాలని, సంఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

 

ఇవి కూడా చదవండి :

Ram Navami 2026 : శ్రీ రామనవమికి అయోధ్య రామ మందిరం ముస్తాబు
Gold Silver Price | పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

Latest News