విధాత: విమానాలు గాలిలో ఎగురుతాయి కాబట్టి.. సిగ్నల్ సమస్య వచ్చిందనో సాంకేతిక సమస్య వచ్చిందనో తమ గమ్యస్థానాలకు కాకుండా వేరే ఎయిర్పోర్టుల్లో దిగుతాయి. కానీ తప్పుడు సిగ్నల్ కారణంగా రైలు ఒక మార్గంలోకి వెళ్లబోయి.. మరో మార్గంలోకి వెళ్లిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటి ఘటన ఒకటి ఫ్రాన్స్లో జరిగింది.
అయితే అది సాధారణ జనం ప్రయాణించే రైలు (Train in Disneyland) కూడా కాదు.. పార్లమెంటేరియన్లు, రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు ప్రయాణించేది కావడం ఇక్కడ కొసమెరుపు. పైగా వారి ట్రైను మార్గం తప్పి అల్లాటప్పా స్టేషనుకు చేరుకోలేదు. ప్రసిద్ధ డిస్నీల్యాండ్ అంతర్గత స్టేషన్కు చేరుకుంది. ఈ ఘటనతో అటు డిస్నీల్యాండ్ నిర్వాహకులు, ట్రైనులోని వారు ఆశ్చర్యపోయారు. సోమవారం ఈ ఘటన జరిగింది.
ఈయూ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొనేందుకు బెల్జియం రాజధాని బ్రజెల్స్ నుంచి ఫ్రాన్స్లో ఉన్న స్ట్రాస్బర్గ్కు వందల మంది యురోపియన్ యూనియన్ ఎంపీ (EU MP’s) లు , అధికారులు రైలులో బయలుదేరారు. వార్తా కథనాల ప్రకారం.. బ్రజెల్స్ లోని మిది స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు చార్లెస్ ది గ్వాలే ఎయిర్పోర్టు స్టేషన్ దాటి డిస్నీ ల్యాండ్ ఉన్న మార్నే లా వ్యాలీకి వెళ్లిపోయింది.
అయితే తప్పును సరిదిద్దిన రైల్వే అధికారులు మళ్లీ రైలును స్ట్రాస్బర్గ్ మార్గంలోకి మళ్లించారు. దీని వల్ల రైలు మొత్తం 45 నిమిషాలు ఆలస్యమైనట్లు తెలిసింది. ఈయూ సమావేశాల్లో పాల్గొనేందుకు యురోపియన్ పార్లమెంటు ఈ ప్రత్యేక రైలును నిర్వహిస్తూ ఉంటుంది. బ్రెసెల్స్, స్ట్రాస్బర్గ్ మధ్య ప్రతి నెలా వందల మంది ఎంపీలు, అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు.
దీనిని అక్కడి విమర్శకులు ఎప్పటినుంచో ట్రావెల్ సర్కస్ అని విమర్శిస్తుండగా.. తాజాగా జరిగిన ఘటనతో ఈ ఈయూ సమావేశాలను మిక్కీ మౌస్ సర్కస్ అని పేర్కొంటూ కామెంట్లు మొదలుపెట్టారు. అయితే తమను రైలు దిగి డిస్నీల్యాండ్లోకి ప్రవేశించడానికి అనుమతించలేదని ఎంపీలు చిర్రుబుర్రులాడారు. మేము బయటకు వెళ్లలేకపోయాం. కిటికీల్లోంచే అక్కడి అద్భుతాలు చూశాం అని ఒక ఈయూ అధికారి అన్నారు. తన సహచర ఎంపీ మొహ్మద్ ఛాహిమ్తో కలిసి మరో డచ్ ఎంపీ సమీరా రఫేలా సెల్ఫీ తీసుకుని టీం డిస్నీల్యాండ్ అని ఎక్స్లో పోస్ట్ చేశారు.