శత్రు దేశాల చమురు నౌకలపైనే మా దాడులు: ఇరాన్ ప్రకటనతో ఊరట
హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శత్రు దేశాల నౌకలకే అడ్డుకట్ట వేస్తామని తెలిపింది. ఈ ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు ఊరట లభించింది.
విధాత : ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ద పరిస్థితులు మధ్య హార్మూజ్ జల సంధి విషయములో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హార్మూజ్ జల సంధిని నియంత్రించే అధికారం మాకుంది అని…అయితే అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయాలనుకోవడం లేదు అని ఇరాన్ ప్రకటించింది. తమ శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయిల్ నౌకలకు మాత్రం జలసంధి మార్గంలో నో ఎంట్రీ అని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ చేసిన ఈ తాజా ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు భారీ ఊరటను ఇచ్చినట్లయ్యింది. ః
హార్మూజ్ జల సంధి మూసివేతతో ఆగిన చమురు నౌకలు
అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దాడి చేసినదానికి ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులను కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ పైన, పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైన దాడులు చేస్తుంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్దం నేపథ్యంలో ఇరాన్ దేశం హర్ముజ్ జలసంధిని అధికారికంగా మూసి వేసింది. జలసంధిని దాటడానికి ప్రయత్నించే నౌకలను తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1 వ తేదీ నుంచి ఈ మార్గంలో పదుల సంఖ్యలో నౌకలు కూడా బయటకు వెళ్లలేకపోవడంతో ప్రపంచ దేశాల్లో సహజవాయువు, చమురు సరఫరా కొరత ఎదుర్కోనే ప్రమాదంలో పడిపోయాయి.
ప్రత్యామ్నాయ మార్గాలు పరిమితం
సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు ఏకైక మార్గంగా ఉన్న హార్మూజ్ జలసంధి కొనసాగుతుంది. హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఓమాన్తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ , ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది. ఈ మార్గానికి పరిమితంగా మాత్రమే ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ప్రపంచ దేశాల అవసరాలు తీర్చలేవు. సౌదీ అరేబియా, యుఏఈ కొంత మేర పైప్లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ డిమాండ్ మేరకు సరఫరా వాటితో అసాధ్యం. ఈ నేపథ్యంలో తమ శత్రు దేశాల నౌకలు మినహా మిగతా దేశాల నౌకలను హార్మూజ్ జలసంధి మార్గంలో అడ్డుకోబోమంటూ ఇరాన్ ప్రకటించడం మెజార్టీ దేశాలకు ఊరటనిచ్చింది.
ఇవి కూడా చదవండి :
Teenage Pregnancies : టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్…టాప్ త్రీలో ఏపీ !
Vrushakarma | భయానక ఫాంటసీ ప్రపంచం ‘వృషకర్మ’… టీజర్లో కొత్త అవతారంలో కనిపించి ఆసక్తి పెంచిన చైతూ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram