పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృ
విధాత, హైదరాబాద్ : పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో మరో 14మంది మరణించారు. వెస్ట్ బ్యాంక్లోని నూర్ షామ్స్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడులతో 14మంది మృతి చెందినట్లుగా, మరో 11మంది గాయపడినట్లుగా పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ మాత్రం పది మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ప్రకటించింది. అంతకుముందు రెండు రోజుల క్రితం రాత్రి రఫా శివారు టెల్ సుల్తాన్లోని నివాస భవనంపై జరిగిన వైమానిక దాడిలో ఆరుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని బంధువులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులతో వలస వెళ్లిన గాజా ప్రజల్లో సగం మంది ఈజిప్టుకు దగ్గరలో ఉన్న రఫాలోనే తలదాచుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి గాజాలో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 34,049కు చేరింది. మరో 76,901 మంది గాయపడ్డారని పాలస్తీనా వర్గాలు వెల్లడించాయి.