న్యూఢిల్లీ : జపాన్ (Japan)ఉత్తర తీరంలో భారీ భూకంపం (Earthquake)సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10 కిలోమీటర్లు లోతులో భూకంప కేంద్రం ఉందని జపాన్ మెటిరోలాజికల్ ఏజెన్సీ (జేఎంఏ) వెల్లడించింది. భారీ భూకంపం నేపథ్యంలోనే జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.
అండమాన్ దీవుల్లో భూకంపం
జపాన్ లో భూకంపం సంభవించిన క్రమంలోనే అండమాన్, నికోబార్ దీవుల్లో(Andaman Earthquake) కూడా ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ పేర్కొంది. పోర్టు బ్లెయిర్కు ఈశాన్యంగా 147 కి.మీ దూరంలో భూకంపం సంభవించిందని, 10 కి.మీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. అయితే, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ మాత్రం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా రికార్డయినట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి భూకంపాలతో ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం అందలేదు.
