Pakistan Air Strike | ఆప్ఘనిస్థాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఆ దేశ రాజధాని కాబుల్లోని ఓ ఆస్పత్రిపై దాడులు జరిపి.. 400 మంది రోగులను పొట్టన పెట్టుకుంది. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది రోగులు మరణించినట్లు ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
పాకిస్తాన్ వైమానిక దాడులకు లక్ష్యంగా చేసుకున్న ఆస్పత్రిలో డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ మాత్రం ఆప్ఘన్ ఆస్పత్రిపై ఎలాంటి వైమానిక దాడులకు పాల్పడలేదని పేర్కొంది. ఆప్ఘన్ నిరాధార ఆరోపణలు చేస్తుందని పాకిస్తాన్ తెలిపింది. ఆస్పత్రులను తాము లక్ష్యంగా చేసుకోలేదని పాక్ పేర్కొంది.
అయితే ఆప్ఘన్, పాక్ సరిహద్దు వెంట కాల్పులు జరిగిన కొద్ది గంటలకే కాబుల్లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి పాల్పడినట్లు ఆఫ్ఘన్ పేర్కొంది. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆఫ్ఘన్కు చెందిన నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా గత కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ కాబూల్లోని ప్రాంతాలపై దాడులు చేయగా అఫ్గాన్ సైతం ప్రతిదాడులతో తిప్పికొడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు క్షిపణులతో భారీ అటాక్ చేసినట్లు తెలుస్తోంది.
