“Civilisation Will Die Tonight”: Trump’s Explosive Warning to Iran Sparks Global Alarm
🔴 ఉద్రిక్తతలు శిఖరాగ్రానికి.. సమరం అంచున ప్రపంచం
- ట్రంప్ ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు
- “ఈ రాత్రే నాగరికత అంతం” వ్యాఖ్య సంచలనం
- ఖార్గ్ దీవిపై పేలుళ్లు.. యుద్ధ భయం
విధాత ప్రపంచం డెస్క్ | హైదరాబాద్ :
Iran Dies tonight | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భయంకర వ్యాఖ్యలతో ప్రపంచాన్ని కుదిపేశారు. ఈ రాత్రికి ఒక నాగరికత పూర్తిగా నశిస్తుందంటూ ఇరాన్కు అత్యంత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో, “అది జరగకూడదనుకుంటున్నా… కానీ జరిగే అవకాశాలే ఎక్కువ” అంటూ వ్యాఖ్యానించారు.
ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత కీలక క్షణమని పేర్కొన్న ట్రంప్, 47 ఏళ్లుగా కొనసాగుతున్న నియంతృత్వం, అణచివేత, అవినీతి, హింసకు ముగింపు పలికే సమయం వచ్చిందని తెలిపారు. అయితే చివర్లో “ఒక అద్భుత పరిణామం జరిగే అవకాశం కూడా ఉందంటూ ఊరట కలిగించారు.
ఇక మధ్యవర్తులు 45 రోజుల కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్నా, పెద్దగా పురోగతి లేదని సమాచారం. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, తమ యుద్ధ లక్ష్యాలు సాధించామంటూ తదుపరి నిర్ణయం ఇరాన్దేనని చెప్పారు.
ఇరాన్ ప్రతిస్పందన.. ఖర్గ్ దీవిపై పేలుళ్లు
అద్భుతమైన టెహ్రాన్ నగరం.. మిలాద్ టవర్ కాంతుల్లో మెరిసే వీధులు, వెనుక అల్బోర్జ్ పర్వతాలు – ప్రకృతి, నగర జీవన శైలి కలయిక
ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటుగా స్పందించింది. “మీరు, మీ మిత్రులు మరపురాని దెబ్బ తింటారు” అంటూ హెచ్చరించింది. టర్కీలోని ఇరాన్ రాయబార కార్యాలయం, “అలెగ్జాండర్ దాడి చేశాడు… మంగోల్స్ విధ్వంసం సృష్టించారు… అయినా ఇరాన్ సగర్వంగా నిలిచింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది” అని ట్వీట్ చేసింది.
Alexander burned it. The Mongols ravaged it. History tested it.#Iran is still here. A psychopath’s threats won’t end what time couldn’t. pic.twitter.com/Okp1dJSByo
— Iran Embassy in Türkiye (@Iran_in_Turkiye) April 7, 2026
ఇదిలా ఉండగా ఖర్గ్ దీవిపై పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఇది ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. అమెరికా సైన్యం అక్కడ సైనిక లక్ష్యాలపై దాడులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ మరోసారి గడువు విధిస్తూ, ఈసారి విద్యుత్ కేంద్రాలు, వంతెనలు లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇక ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ మాత్రం, ట్రంప్ హెచ్చరికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని హెచ్చరించారు.
