Charlie Kirk Death News | డొనాల్డ్ ట్రంప్ సన్నిహిత అనుచరుడు చార్లీ కిర్క్ దారుణ హత్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అనుచరుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేగింది. కిర్క్ హత్యకు కారకులైన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ట్రంప్ తేల్చి చెప్పారు.

Charlie Kirk Death News | అమెరికాలో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అనుచరుడైన చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యారు. ఉటా కాలేజీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కిర్క్ ప్రసంగిస్తున్న సమయంలో కాలేజీ రూఫ్పై నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. ఆయన సభికుల ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న క్రమంలో దుండగుడు పేల్చిన తూటా నేరుగా ఆయన మెడకు తాకింది. వెంటనే నెత్తురు ప్రవహించింది. సమాధానం చెబుతున్న సమయంలో ఒక్కసారిగా మెడపైకి చేయి వేసి.. కిర్క్.. తలవాల్చేసి.. తనకు ఎడవవైపునకు ఒరిగిపోయారు. ఆ సమయంలో ఆయన తెల్లటి టీషర్ట్ వేసుకుని ఉన్నారు. దానిపై ‘ఫ్రీడం’ అని ఇంగ్లిష్ అక్షరాల్లో రాసి ఉంది. కాల్పుల గురించి మాట్లాడుతున్న సమయంలోనే కాల్పులకు గురికావడం యాదృచ్ఛికం. కిర్క్ అమెరికాలోనే అతిపెద్ద కన్జర్వేటివ్ యూత్ మూవ్మెంట్ నాయకుడు. దీనిని ఆయన తన 18వ ఏట 2012లో స్థాపించాడు. కిర్క్ పాల్గొన్న కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబోయే 15 కార్యక్రమాల్లో ఒకటి. అక్టోబర్ చివరి వరకూ వీటిని నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించారు. కానీ.. తొలి సమావేశంలోనే తుపాకి గుళ్లకు బలైపోయారు. వెంటనే ఆయనను స్ట్రెచర్పై భద్రతా బలగాలు తీసుకువెళ్లాయి. ఘటన నేపథ్యంలో సమావేశ స్థలంలో హాహాకారాలు మిన్నంటాయి. సభకు హాజరైనవారు బయటకు పరుగులు తీశారు.
ర్యాడికల్ వామపక్ష రాజకీయ హింస అనేక మంది ప్రాణాలను బలిగొన్నదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన ఒవల్ ఆఫీస్ నుంచి ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. కిర్క్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆయన హత్యకు ర్యాడికల్ వామపక్షమే కారణమని ఆరోపించారు. గత ఏడాది పెన్సిల్వేనియాలోని బట్లర్లో తనపై జరిగిన హత్యాయత్నం మొదలుకుని.. ఐసీజీ ఏజెంట్లపై దాడులు, న్యూయార్క్ నగర వీధుల్లో హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ హత్య తదితరాలను ట్రంప్ ప్రస్తావించారు. అమెరికాలో ఉగ్రవాదానికి ర్యాడికల్ వామపక్షాలే కారణమని ఆరోపించారు. దీనికి ఇక ముగింపు పలకాల్సి ఉందని అన్నారు. దేశంలో రాజకీయ హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ దారుణానికి, దేశంలో రాజకీయ హింసకు కారకులైన ప్రతి ఒక్కరినీ, వారికి ఆర్థికంగా సహకరిస్తున్న సంస్థలను, మన జడ్జీలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు, ఈ దేశాన్నిగాటన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నవారి వెంట పడుతున్న ప్రతి ఒక్కరినీ కనిపెట్టితీరుతామని ట్రంప్ అన్నారు. కిర్క్ మరణానికి సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై అమెరికా జాతీయ పతాకాన్ని అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకూ అవనతం చేయాలని ట్రంప్ ఆదేశించారు.
కిర్క్ హత్య నేపథ్యంలో తొలుత అదుపులోకి తీసుకున్న ఒక వ్యక్తిని విచారించి వదిలేసినట్టు ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ధృవీకరించారు. ఉటా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి తనిఖీలు లేవని విద్యార్థులు చెబుతున్నారు. మెటల్ డిటెక్టర్లు కానీ, బ్యాగులను తనిఖీ చేయడం వంటివి ఏవీ లేవని అంటున్నారు. ఈ ఈవెంట్కు భద్రత నిమిత్తం ఆరుగురు యూనివర్సిటీ పోలీస్ అధికారులకు బాధ్యతలు ఇచ్చారని, వారితోపాటు కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారని చెబుతున్నారు. కనీసం తమ టికెట్లను కూడా ఎవరూ తనిఖీ చేయలేదని పేర్కొంటున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే అమెరికాలో రాజకీయ ఉద్దేశాలతో 150కి పైగా దాడులు చోటుచేసుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇవి రెట్టింపు అని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ రిసెర్చర్ జెన్సెన్ చెబుతున్నారు. ఘటన నేపథ్యంలో హంతకుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు విస్తృస్థాయిలో గాలింపు జరుపుతున్నాయి. తొలుత ఇద్దరు వ్యక్తులను అనుమానించి అదుపులోకి తీసుకున్నా, విచారణ అనంతరం వారిని విడిచిపెట్టారు.
కిర్క్ మృతిపై వివిధ దేశాధినేతలు స్పందించారు. ఇజ్రాయెల్కు సింహంలాంటి తెగువ ఉన్న స్నేహితుడంటూ ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు నివాళులర్పించారు. ఈ హత్య ప్రజాస్వామ్యానికి లోతైన గాయమని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అన్నారు. రాజకీయ హింస ఏ విధంగానూ సమర్థనీయం కాదని బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. చార్లీ కిర్క్ హత్య ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా కెనడా ప్రధాని మార్క్ కార్నే అభివర్ణించారు. అమెరికాలో రాజకీయ హింసకు స్థానం లేదని కమలా హ్యారిస్ వ్యాఖ్యానించారు.
అత్యంత ప్రభావశీల నేతల్లో ఒకరు
అమెరికా రాజకీయాల్లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో చార్లీ కిర్క్ ఒకరు. గత ఎన్నికల్లో ట్రంప్నకు అనుకూలంగా ఓటేయించడంలో కిర్క్ కీలక పాత్ర పోషించారు. కన్జర్వేటివ్స్ అభిప్రాయాలను యువతలోకి తీసుకువెళ్లేందుకు 2012లో ఆయన ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ అనే సంస్థను స్థాపించారు. కిర్క్ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో యువత హాజరువుతుంటారు. ఆయన యూట్యూబ్, ఇన్స్టాలో లక్షల మంది అభిమానులు ఉన్నారు. కిర్క్ వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడు. జెన్ జీ ఓటర్లను ఆకర్షించే క్రమంలో ఆయన అనేక సందర్భాల్లో జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. సహ రైట్వింగ్ కార్యకర్త జాక్ పోసెబెయిక్తో కలిసి పాల్గొన్న ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్లో ‘క్షమించండి! నేను ఒక నల్లజాతి పైలట్ను చూసి ఏమనుకుంటానంటే.. ‘నాయనా.. అతడు క్వాలిఫైడ్ పర్సన్ అయి ఉంటాడని అనుకుంటా’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలో జాతి వివక్షను వ్యతిరేకించిన చట్టాన్ని కిర్క్ వ్యతిరేకించారు. 2023లో జరిగిన ఒక కార్యక్రమంఓల పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను భయానక వ్యక్తిగా, చెడ్డవాడిగా అభివర్ణించారు. 1960లో జాతి వివక్ష నిర్మూలన చట్టం చేయడం ద్వారా అతిపెద్ద తప్పిదానికి పాల్పడ్డామని వ్యాఖ్యానిస్తుండేవారు.
కిర్క్ భార్య ఎవరు?
చార్లీ కిర్క్ భార్య ఎరికా ఫ్రాంట్జ్వే. ఆమె ఆరిజోనా రాష్ట్రంలోని స్కాట్స్డేల్లో 1988 నవంబర్ 20న జన్మించారు. ఆమె మొదట్లో మోడల్గా వ్యవహరించారు. రేగిస్ యూనివర్సిటీ తరఫున నేషనల్ కాలేజీల అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొన్నారు. ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్తో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లోనూ, అమెరికన్ లీగల్ స్టడీస్లో జ్యూరిస్ మాస్టర్స్ డిగ్రీని లిబర్జీ యూనివర్సిటీ నుంచీ పొందారని ఆమె వెబ్సైట్ ద్వారా తెలుస్తున్నది. 2012లో మిస్ ఆరిజోనా యూఎస్ఏగా ఎంపికయ్యారు. తన భర్త హత్య అనంతరం ఎక్స్లో బైబిల్లోని 46:1ని పంచుకుంటూ, ‘దేవుడు మన ఆశ్రయం, బలం. కష్టకాలంలో ఆయన మనకు అత్యంత అనుకూలమైన సహాయకుడు’ అని రాశారు.
ట్రంప్ విజయంలో కీలక పాత్ర
2024 ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో చార్లీ కిర్క్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ అజెండాను యువతలోకి తీసుకువెళ్లడం ద్వారా వారి మద్దతును ట్రంప్నకు కూడగట్టారు. జాతి, వలసలు, లింగ బేధాలను ప్రధానంగా ప్రస్తావించేవారు. కిర్క్కు ఎక్స్లో 5.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రతి నెలా దాదాపు ఐదు లక్షల మంది ఆయన పాడ్కాస్ట్ ప్రసంగాలు వింటూ ఉంటారు.
భారత వ్యతిరేకి!
భారతీయులకు ఇకపై ఎంతమాత్రం వీసాలు మంజూరు చేయకూడదని కిర్క్ వాదించేవారు. ఇటీవల ఎక్స్లో ఒక పోస్టింగ్ చేస్తూ.. ‘భారతీయులకు మరిన్ని వీసాలు ఇవ్వాల్సిన అవసరం అమెరికాకు లేదు. అమెరికా ఇప్పటికే నిండిపోయింది. ఇక సొంత దేశస్థులను (అమెరికన్లను) ముందు నిలపాల్సిన సమయం ఆసన్నమైంది’ అన్నారు.