Chandrababu Naidu| ఏపీని ఏఐకి చిరునామాగా మారుద్దాం: సీఎం చంద్రబాబు

ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్‌పై కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu| ఏపీని ఏఐకి చిరునామాగా మారుద్దాం: సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు19 : ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు(Visakhapatnam investment summit)లో పెట్టుబడులతో పాటు పాజిటివ్ పాలసీ మేకింగ్‌పై కూడా చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం పెట్టుబడులు, ఒప్పందాలకే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పరిశ్రమల శాఖామంత్రి టీజీ భరత్, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఈడీబీ అధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా భారత పరిశ్రమల సమాఖ్య డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సులో దావోస్ తరహాలోనే పెట్టుబడిదారులు, పాలసీమేకర్ల మధ్య చర్చలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెట్టుబడులు, ఎంఓయూలకు మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కోసం కూడా ప్లీనరీ సెషన్లు, బ్రేకవుట్ సెషన్లు నిర్వహించాలని సూచించారు. ఏఐ ఫర్ గుడ్, సెమీ కండక్టర్స్, ఆరోగ్య రంగం, ఇన్నోవేషన్, ఆర్ అండీ, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ లాంటి అంశాలపై సదస్సులో చర్చించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, చైన్ లింకేజ్‌తో పాటు నాణ్యమైన ఉత్పత్తుల తయారీ లాంటి అంశాలపై చర్చించాలన్నారు. లాజిస్టిక్స్ రంగంలో రహదారులు, అంతర్గత జలరవాణా, వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజీలు లాంటి అంశాలతో పాటు అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్‌లో విలువ జోడింపు, స్వచ్ఛ ఆంధ్రా, సర్క్యులర్ ఎకానమీ, పీ4 లాంటి అంశాలపై కూడా చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. వన్ ఫ్యామిలీ వన్ ఏఐ తరహాలో ఏపీ టూ ఏఐ నినాదాన్ని(AI initiatives in AP) ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.

అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా భాగస్వామ్య సదస్సు

పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అవుతాయని, ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని సీఎం అన్నారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోందన్నారు. గూగుల్ రాకతో విశాఖ హ్యాపెనింగ్ సిటీగా మారిందన్నారు. సానుకూల విధానాలతోనే వాణిజ్యం, పరిశ్రమలు పెట్టుబడులతో ముందుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అప్పుడే సంపద సృష్టికి ఆస్కారం కలుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల నైపుణ్యం నిరంతర ప్రక్రియగా ముందుకుసాగాలని అన్నారు. మానవ వనరులే మనకు ఉన్న అతిపెద్ద మూలధనం అని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటన్నిటిపైనా భాగస్వామ్య సదస్సులో చర్చ జరగాలని సీఎం పేర్కొన్నారు. విశాఖలో జరిగే సీఐఐ సదస్సుకు హాజరయ్యే వారికి హోం స్టేలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులను, నిపుణులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించాలని సీఎం స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యా సంస్థలు కూడా హాజరయ్యేలా చూడాలని అన్నారు. 1వ శతాబ్దం భారత్‌దే అన్న విధానంలో ప్రజంటేషన్ ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.